వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న అనేక కార్యక్రమాల వల్ల కులవృత్తులు పునర్జీవం పోసుకుంటున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి నియోజకవర్గం శ్రీరంగాపురం మండలకేంద్రంలోని రంగసముద్రంలో ప్రభుత్వ ఉచిత చేపల పంపిణీలో భాగంగా చెరువులో రొయ్యలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో చెరువులు ఎండిపోయి, మత్స్యకారులు వలసపోయారని అన్నారు.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు నింపారని గుర్తు చేశారు.ఉచిత చేప పిల్లలు చెరువుల్లో విడిచి మత్స్యకారులకు ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు చేపల రూపంలో అందుబాటులో పౌష్టికాహారం,సబ్సిడీ గొర్రె పిల్లలతో గొల్ల కురుమలకు ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని అన్నారు.
రైతుబంధు, రైతుబీమా, ఉచితంగా 24 గంటల కరంటు, సాగునీటి సౌకర్యంతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వెల్లడించారు. రైతు ఏ కారణం చేత మరణించినా 10 రోజులలో రూ.5 లక్షల పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు పేర్లు మార్చి పథకాలు అమలు చేస్తున్నాయని ఆరోపించారు . ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.