హైదరాబాద్ : సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ విజన్ వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy) తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సహాకాలతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీయల్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఎక్స్పో(Expo-2023)ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
రాష్ట్రంలో పెట్టుబడులు(Investments), పరిశ్రమలు(Industries) భారీ ఎత్తున ఏర్పాటుకు ఐటీ , పరిశ్రమల మంత్రి కేటీఆర్(Minister KTR) కారణమని అన్నారు. అటువంటి నేత పరిశ్రమల మంత్రిగా ఉండడం పారిశ్రామిక వేత్తలు అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నెంబర్ వన్ గా ఉంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) దేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం సంపూర్ణ ఆర్థిక ప్రగతి సాధించిందన్నారు.
నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి పరచడం ద్వారా వ్యవసాయ రంగంతో పాటు చేపల పెంపకం, మాంసం ఉత్పత్తులలో గణనీయమైన ప్రగతిని సాధించామని వివరించారు. మిల్లట్ల(Mellets) సాగులో మొదటి నుంచి తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వినూత్నంగా తయారు చేస్తున్న ఉత్పత్తుల ప్రదర్శనలను జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు వినూత్నంగా రూపొందించిన ఉత్పత్తుల ప్రదర్శనశాలను మంత్రి సందర్శించారు. కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు మీలా జయదేవ్, తారా సత్యవతి, విష్ణువర్ధన్ రెడ్డి, అనిల్ అగర్వాల్, శ్రీనివాస్ మహంకాళి, సురేష్ కుమార్ సింఘాల్, పాస్ పోర్ట్ అధికారి బాలయ్య పాల్గొన్నారు.