ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. తనకు రెండో సారి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమావేశమై రాష్ర్టానికి విరివిగా నిధులు వచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు.
వివిధ ప్రాజెక్టులకు అనుమతులు, వాటికి నిధులు తీసుకురావటానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సుహృద్భావ వాతావరణంలో విధులు నిర్వహిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.