హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ నూతన కోర్సుల రాక కాస్త ఆలస్యంకానున్నదా..? దోస్త్ మొదటి విడుత తర్వాతే ఇవి అందుబాటులోకి రానున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే దోస్త్ మొదటి విడుత కౌన్సెలింగ్లోపు ఈ కోర్సులు అందుబాటులోకి రావడం కష్టంగానే కనిపిస్తున్నది. రాష్ట్రంలో 220 డిగ్రీ కాలేజీలు పలు కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో అత్యధికంగా కోర్సుల కన్వర్షన్కు దరఖాస్తు చేసుకోగా, 90 వరకు కాలేజీలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో తనిఖీలు చేయాల్సిన అవసరంలేదు.
కానీ కొత్త కోర్సులు ప్రవేశపెట్టే కాలేజీల్లో మాత్రం తనిఖీలు చేయాల్సిందే. కానీ ఇప్పటివరకు తనిఖీలు షురూ కాలేదు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 30 నుంచి మొదటి విడుత వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. మే 8తో వెబ్ ఆప్షన్ల గడువు ముగుస్తున్నది. వెబ్ ఆప్షన్ల గడువు ముగిసేలోపు కొత్త కోర్సులకు యూనివర్సిటీలు అనుమతులివ్వడం కష్టంగానే కనిపిస్తున్నది. ఆలస్యం చేస్తే కొత్త కోర్సులకు డిమాం డ్ ఉంటుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్ ఆప్షన్ల గడువును పొడిగించడం లేదంటే, రెండో విడుత తర్వాత కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడమా? అన్న చర్చ నడుస్తున్నది.