హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ప్రభుత్వం నీళ్లు అక్రమంగా తీసుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అభ్యంతరం తెలపడం లేదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy ) ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీ అక్రమంగా నీటి తరలింపుపై రేవంత్ సర్కార్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ లాబీయింగ్ కోసం తెలంగాణ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడతారా అంటూ నిలదీశారు.
తెలంగాణ నీళ్లను తరలిస్తుంటే దానికి అభ్యంతరం చెప్పకపోవడం అంటే అనుమతి ఇచ్చినట్లేనని, రేవంత్, ఉత్తమ్ కుమార్రెడ్డి లంచం తీసుకుని ఏపీకి నీటిని విడుదల చేశారని దుయ్యబట్టారు. కృష్ణా జలాల తరలింపును అడ్డుకోకుండా నల్గొండ ఆయకట్టుకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి రోజుకి 40 క్యూసెక్కుల నీళ్లు ఏపీకి తీసుకుపోతున్నారని , శ్రీశైలం – నాగార్జున సాగర్లో ఉన్న నిల్వ నీళ్లలో తక్కువబడిన 150 టీఎంసీల నీళ్లు ఏపీ ప్రాజెక్టుల్లో ఉన్నాయని పేర్కొన్నారు.
మీ రాజకీయ అవసరాల కోసం ఇక్కడ రైతులను ముంచి ఏపీకి నీళ్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సెప్టెంబర్ 3న మిర్యాలగూడలో రైతు మహాధర్నా ను నిర్వహిస్తున్నామన్నారు.