Assigned Lands | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం పేదలకు చెందిన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలనే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణమే మార్చుకోవాలని కోరింది. మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ర్టాల సమన్వయకర్త వసంత లక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య నేతృత్వంలోని కమిటీ ఆదివారం అప్పాయిపల్లిలోని బాధితులను కలిసి వివరాలను సేకరించింది. గ్రామంలోని సర్వే నంబర్ 19లో 75 ఎకరాల భూమిని 1972లో 47 కుటుంబాలకు నాటి ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు అందించిందని వారు పేర్కొన్నారు.
మూడు తరాలుగా ఆ భూమిపై ఆధారపడి 150 నిరుపేద కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. మెడికల్ కాలేజీ కోసం ప్రభుత్వం ఆ భూమిని సేకరించడం అన్యాయమని విమర్శించారు. ఒక్క నియోజకవర్గం కోసమే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే రేవంత్రెడ్డి ప్రభుత్వ ఆలోచనే పెద్ద తప్పు అని, దాని ద్వారా ఆ ప్రాంత ప్రజలకుగానీ, విద్యార్థులకుగానీ ఎటువంటి ప్రయోజనం కలగబోదని స్పష్టం చేశారు. కొడంగల్ పరిసరాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నదని, అక్కడ నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ దవాఖాన కట్టాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ బొల్లి ఆదంరాజు, హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి సంజీవ్, వెంకటనారాయణ, రోహిత్, మధు పాల్గొన్నారు.