ఆదిలాబాద్ : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా 120 మంది జర్నలిస్టులకు సేఫ్టీ కిట్స్, ఆరోగ్య బీమా పత్రాలను అందించారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విలేకరులను ప్రశంసించారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. జర్నలిస్టుల సేవలను గుర్తించి మెడికల్ కిట్లు, బీమా కవరేజీ స్పాన్సర్ చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 4,500 ఆస్పత్రుల్లో బీమా సౌకర్యం పొందవచ్చని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి త్వరగా పరిష్కారం అయ్యేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల రక్షణకు ముందుకు వచ్చిన జోగు ఫౌండేషన్ను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జి.నగేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకులు బేత రమేశ్, విట్టల్, దత్తు, రఘు, జోషి, ప్రవీణ్, షహీద్, తదితరులు పాల్గొన్నారు.