హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ను వీడే ప్రసక్తేలేదని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకొంటానని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
వ్యక్తిగత పనుల మీద రెండు రోజులు పాండిచ్చేరి, చెన్నై వెళ్లానని, దీంతో లేనిపోనివి ఊహించుకొని అవాస్తవాలు ప్రచారం చేయటం సరికాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్కు తనకు దశాబ్దాల అనుబంధం ఉన్నదని, టీఆర్ఎస్లో కూడా తనకు ఎంతో గౌరవం ఉన్నదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కోసం సిపాయిలా పనిచేస్తానని వెల్లడించారు.