హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): బ్యాంకు దోపిడీగాళ్లకు వత్తాసు పలుకుతున్న కేంద్ర ప్రభుత్వ పాపాల పుట్టను త్వరలోనే పగులగొడతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో తెలివితక్కువ ప్రభుత్వం ఉన్నదని, రాష్ర్టాలపై నీచమైన, దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం బలంగా ఉండాలి.. రాష్ర్టాలను బలహీనపర్చాలన్నదే బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానమని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘చిప్ప పట్టుకొని లైన్ల నిలబడాలి. కేంద్రం చెప్పు చేతుల్లో ఉండాలి. అంటే.. ఫెడరల్ సమాఖ్యకు పూర్తి విరుద్ధమైన దిక్కు మాలిన సిద్ధాంతం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టాలకు అధికారాలివ్వాందిపోయి కేంద్ర ప్రభుత్వం సంయుక్త జాబితా (కాంకరెంట్ లిస్ట్) పేరిట రాష్ర్టాల అధికారాలను కబళిస్తున్నదని ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంచలేదని తెలిపారు. కేంద్రం మాత్రం రోజుకో రూపాయి చొప్పున పెంచుతున్నదని, పైగా రాష్ర్టాలపైనే దుష్ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పెట్రోల్, డీజిల్పై వ్యాట్ వేసుకునే అధికారం రాష్ర్టానికి కూడా ఉంటది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను పైసా కూడా పెంచలేదు, దించలేదు. కేంద్రం మాత్రం రోజూ పెంచుతున్నది. నీవు పెంచాలి.. మేము తగ్గించాల్నా? అంటే నీ జేబు నిండాలి, మా జేబు ఖాళీ కావాలా? నీవు పెంచకుండా.. మమ్మల్ని తగ్గించమంటే నీవు గొప్పోనివి అయితవు. నేను పెంచుతా.. నీవు తగ్గించాలి అనడం ఏమి నీతి?’ అని కేంద్రాన్ని నిలదీశారు.