హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కి అన్నివిధాలుగా అండగా ఉంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థల మధ్య ఏర్పడే వివాదాల పరిష్కారానికి కోర్టులకంటే మధ్యవర్తిత్వ కేంద్రాలే మేలని తెలిపారు. నానక్రామ్ గూడలో శనివారం ఐఏఎంసీ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారానికి వీలు కల్పించేలా త్వరలోనే చట్ట సవరణ చేస్తామని తెలిపారు. తక్షణమే ఆర్డినెన్స్ జారీచేసేలా అధికారులకు ఆదేశాలిస్తామన్నారు. చట్టసవరణపై సలహాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జస్టిస్ లావు నాగేశ్వర్రావు వద్దకు పంపుతామని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సహకారం అందించాలని సీజేఐ, ఇతర న్యాయమూర్తులకు విజ్ఞప్తిచేశారు. అందరి సూచనల తర్వాత స్థానిక ఐఏఎంసీలో కేసుల రాజీకి చట్ట సవరణ చేస్తామని ప్రకటించారు.
హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ తగిన ప్రచారం రావటంలేదని దేశవిదేశాల్లోని తన స్నేహితులు చెప్పినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ‘నిన్న సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరుముగ్గురు మిత్రులు హైదరాబాద్లోని పలు ప్రదేశాలుచూసి అబ్బురపడ్డారు. నగరం సింగపూర్ కంటే బాగున్నదని, అందుకు తగిన ప్రచారమే లేదని అన్నారు. కొన్ని విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు మించి హైదరాబాద్ నగరం పురోగమిస్తున్నది. ఈ సందర్భంలో జస్టిస్ ఎన్వీ రమణ దీవెనల ఫలితంగా నగరంలో ఐఏఎంసీని ఏర్పాటుచేసుకొన్నాం. ప్రగతిశీల భావాలున్న జస్టిస్ రమణ.. పెరిగి, న్యాయవాద వృత్తిని చేపట్టి, న్యాయమూర్తిగా ఉన్నత శిఖర అధిరోహణ ప్రారంభించింది హైదరాబాద్లోనే. అందుకే నగరానికి ఏదైనా మంచిచేయాలని తలంచి దీవించిన ఫలితమే ఐఏఎంసీ. మనమంతా గర్వంగా చెప్పుకొనేలా భారత న్యాయవ్యవస్థలో అత్యునత స్థానానికి చేరిన ఆయన హైదరాబాద్ను మరిచిపోకుండా అకున చేర్చుకోవడం అభినందనీయం’ అని అన్నారు. ఐఏఎంసీ ఏర్పాటుకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ రవీంద్రన్, సీఎస్ సోమేశ్కుమార్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ తదితరుల కృషిని కొనియాడారు.
భవిష్యత్తులో అనేక విషయాల్లో హైదరాబాద్ నగరం ప్రపంచానికి కేంద్ర బిందువు కాబోతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘అనేక కారణాలవల్ల కోర్టుల్లో కేసుల పరిష్కారం చాలా ఆలస్యమైతున్నది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్బిట్రేషన్ సెంటర్లలో వివాదాలు త్వరగా పరిషారమవుతున్నాయి. ఈ విధానంపై అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అలాంటి మధ్యవర్తిత్వ కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటుకావడం మనందరికీ గర్వకారణం. ఇది భవిష్యత్తులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది హైదరాబాద్కే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి, మొత్తం వ్యవస్థకు పేరు ప్రతిష్ఠలు తెస్తుంది. అందుకు శుభ సూచకాలు కూడా కనపడుతున్నాయి. ఐఏఎంసీ ప్రారంభానికి ముందే చాలా పెద్ద కేసు రావడం శుభసూచకమే’ అన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమాకోహ్లీ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ పీకే మిశ్రా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ, పోలీసు, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
పెట్టుబడులు, మల్టీనేషనల్ కంపెనీల ఏర్పా టుకోసం విదేశాలకు వెళ్లినప్పుడు ఐఏఎంసీ గురించి ముందుగా చెప్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. త్వరలో దావోస్ వెళ్తున్నామని, అకడి నుంచే ఐఏఎంసీ గురించి ప్రచారం మొదలుపెడ్తామని తెలిపారు. ఐఏఎంసీ ప్రారంభం తర్వాత లీగల్ రిపోర్టర్లతో కేటీఆర్ ముచ్చటించారు. హైదరాబాద్లోని వసతులు, ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు, ఇకడి వాతావరణంతోపాటు ఇప్పుడు ఐఏఎంసీ వల్ల సత్వర వివాద పరిష్కారంపై గట్టిగా ప్రచారం చేస్తామని వెల్లడించారు. గతం లో పెట్టుబడుల కోసం ఎకడికి వెళ్లినా ఏదైనా వివాదం ఏర్పడితే పరిష్కారానికి ఎంతకాలం పడుతుందని అడిగేవారని, ఇప్పుడు ఐఏఎంసీతో దానికి సమాధానం లభించిందని చెప్పారు.