హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్ శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో అక్రమాలను వెలికితీసేందుకు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తే ఎంపీ రేవంత్రెడ్డి ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. ఆలయ భూములు అన్యాక్రాంతం చేసినవారి బండారం బయటపడుతుందని, అందులో రేవంత్ బినామీలు ఉన్నారని ఆయన భయపడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణభవన్లో ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, ఎం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు గోపీనాథ్, ముఠా గోపాల్తో కలిసి సుమన్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక ఎంపీగా రేవంత్రెడ్డి స్వాగతించాల్సిందిపోయి ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రజాభీష్టం మేరకు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని సాక్షాత్తు ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పుడు, పత్రికలు రాసినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజలపక్షాన ఉన్న ప్రజాప్రతినిధిగా రేవంత్రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి ఆ నిర్ణయమే తప్పన్నట్టుగా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్గా, ల్యాండ్ గ్రాబర్గా పేరున్న రేవంత్రెడ్డి ఉలికిపాటు వెనుక ఆయన బినామీల గోదాములు బయటపడతాయన్న ఆందోళన కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.
దేవరయాంజల్ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలు ఎన్ని? దేవాలయ పరిధిలో ఉన్న వాస్తవ భూమి ఎంత? ఎక్కడెక్కడ, ఎంత భూమి అన్యాక్రాంతమైంది? ఎవరు అన్యాక్రాంతం చేశారు? ఇప్పుడెంత భూమి ఉన్నది? వంటి వివరాలను నిగ్గుతేల్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురు ఐఏఎస్ అధికారులతో విచారణ కమిటీ వేశారని సుమన్ పేర్కొన్నారు. విచారణకు ఏసీబీ, విజిలెన్స్ను ఆదేశించారని చెప్పారు. రాముడి భూములను కాజేసిన రాక్షసులెవరో? గుడి భూములకు దడికట్టిన దండగమారి పుండాకోరులెవరో బయటికి తీసి ప్రతి ఇంచుభూమిని పరిరక్షించేందుకు సీఎం కేసీఆర్ దమ్మున్న నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ నిర్ణయాన్ని టీఆర్ఎస్ పార్టీగా, తెలంగాణ బిడ్డగా స్వాగతిస్తున్నామన్నారు. భూమిని అన్యాక్రాంతం చేసిన వారెవరైనా, ఎంతటివారైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పారు.
నమస్తే తెలంగాణ పత్రికపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు. నమస్తే తెలంగాణ ప్రజల గొంతుకగా ఉంటుందని, తెలం గాణ ఉద్యమ సమయంలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో నమస్తే తెలంగాణ తన విధ్యుక్త ధర్మాన్ని నెరవేస్తుందని అన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక ప్రింటింగ్ ప్రెస్ ఎండోమెంట్ భూముల్లో లేదని చెప్పారు. ఒకవేళ ఉంటే అదికూడా విచారణలో తేలుతుందని ఆయన స్పష్టంచేశారు. దేవరయాంజాల్ వివాదంలో ప్రతి ఇంచు భూమి వివరాలను తేల్చేందుకే ప్రభు త్వం కమిటీ వేసిందని ఆయన వెల్లడించారు.