Pallapu Govardhan | చాలాకాలం నుంచి బీజేపీలో ఉన్న పల్లపు గోవర్ధన్ ఆ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది?
నేను ఆరెస్సెస్, భాగ్యనగర్ ఉత్సవ సమితి, హిందూ సంఘాలు, బీజేపీలో ఇలా మొత్తంగా సుమారు 22 ఏండ్లు సేవలు అందించాను. వందల సభలు, సమావేశాలు నిర్వహించాను. మొన్నటికి మొన్న మునుగోడు ఉప ఎన్నికలో కూడా పనిచేశాను. వడ్డెర సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. అయినా ఖైరతాబాద్లో మాలాంటి వాళ్లకు తగిన గుర్తింపు, గౌరవం లేదు. కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే పార్టీని విడిచిపెట్టాల్సి వచ్చింది.
ఖైరతాబాద్ టిక్కెట్ ఇవ్వలేదనే కారణం వల్లే పార్టీ వీడారన్న విమర్శలకు మీ సమాధానం.
ఖైరతాబాద్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోరాడాను. చింతల రామచంద్రారెడ్డికి రెండు మూడు దశాబ్దాలుగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. పార్టీలో యువతకు ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు. ఈసారైనా యువతకు ఇవ్వాలని, ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేయాలని కోరాను. రాష్టంలో 28 లక్షల మంది వడ్డెరలు ఉన్నారు. ఖైరతాబాద్లో మా ఓటర్లు వేలాది మంది ఉన్నారు. వారి ప్రతినిధిగా టికెట్ ఆశించడం తప్పేం కాదు. కానీ రాష్ట్ర నాయకత్వం మా వినతి పట్టించుకోలేదు.
బీసీలకు పెద్దపీట వేస్తున్నామని బీజేపీ చెబుతున్నది. బీసీల ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీ కూడా వచ్చారు కదా?.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 150-180 బస్తీలు ఉన్నాయి. అన్ని కులాల వారు ఉండే మినీ ఇండియా ఈ ప్రాంతం. బీజేపీ నిజంగా బీసీలకు పెద్దపీట వేసే పార్టీ అయితే ఖైరతాబాద్ టికెట్ను బీసీలకే ఇవ్వాలి. బీజేపీ అంటేనే జాతీయ వాదం, క్రమశిక్షణ అనే భావన ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పార్టీలో జాతీయ భావం లోపించింది. మూల సూత్రాలను పక్కనబెట్టి, కులాల కుంపట్లు, వ్యక్తిగత ద్వేషాలతో వీధుల్లో పోరాటాలు చేసుకునే స్థాయికి దిగజారింది.
బీఆర్ఎస్నే ఎందుకు ఎంచుకున్నారు?
నేను బీజేపీలో ఉన్నా తెలంగాణ ఉద్యమకారుడినే. మిలియన్ మార్చ్ సహా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. రాదు అన్న రాష్ర్టాన్ని.. సాధించిన వ్యక్తి సీఎం కేసీఆర్. ఆయన పోరాటాన్ని కండ్లారా చూశాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నిరంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి ఆయన పడిన తపనను కూడా దగ్గరుండి చూశాను. ఉద్యమంలోనే ఉద్దండుడు అనుకుంటే.. అభివృద్ధిలో మహా ఉద్దండుడిగా ఆయన కనిపించారు. కేసీఆర్ పాలించే విధానం నచ్చి, రాముడికి ఉడుత సాయంగా నా వంతు సాయం చేసేందుకు బీఆర్ఎస్లో చేరాను. l మహేందర్