MP Laxman హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి గేట్లు ఎత్తే రాజకీయం మాని, రాష్ర్టానికి విద్యుత్తు సరఫరా చేసే సంగతిని చూడాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టానికి అనుగుణంగా ఎన్టీపీసీలో 4,000 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ నిర్మిస్తే, 85 శాతం విద్యుత్తు తెలంగాణకు వాటాగా రావాల్సి ఉన్నదని వివరించారు.
ఇప్పటికే 1,600 మెగావాట్ల విద్యుదుత్పత్తి మొదలైందని తెలిపారు. మిగతా యూనిట్ల కోసం ఒప్పందం చేసుకోవాలని ఎన్టీపీసీ వరుసగా లేఖలు రాసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా జనవరిలో రెండుసార్లు లేఖలు రాసిందని, అయినా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే ఆ విద్యుత్తును వేరే రాష్ర్టానికి మళ్లిస్తామని ఎన్టీపీసీ హెచ్చరిస్తున్నదని చెప్పారు. వేసవి మొదలుకాగానే కరెంటు కోతలు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు.