Bandi Sanjay | అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో హుస్నాబాద్కు చెందిన పలువురు సర్పంచులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి బోనస్ ఇవ్వకుండానే పార్లమెంటు ఎన్నికల తర్వాత రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మేది ఎవరని నిలదీశారు. తాలు, తరుగు తేమతో పని లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
దేశానికి రక్ష మోదీనేనని చిన్నపిల్లవాడు మొదలు ముసలి తాత వరకు అందరూ ముక్తకంఠంతో నినదిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. బీజేపీకి 370 సీట్లకు పైగా రావడం ఖాయమైందని, ఈ విషయం తెలిసిన తర్వాత కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చాలా చోట్ల పంట నష్టపోయి అల్లాడుతున్న రైతులు నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
బీజేపీకి రూ.500 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు ఇస్తే లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చిందంటూ పొన్నం చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ దగ్గర మీడియా ప్రస్తావించగా.. గౌరవ న్యాయస్థానాలపైనా అభాండాలు మోపడం నీచమని విమర్శించారు. అధికారంలో ఉంటూ ఏది పడితే అది మాట్లాడుతుంటే ప్రజలు సహించరని హెచ్చరించారు. ఇది ముమ్మాటికీ కోర్టు ఉల్లంఘన పనేనని స్పష్టం చేశారు. కోర్టుకు అవినీతిని ఆపాదించడం క్షమించరాని నేరమని అన్నారు. ఎంతోమంది కాంగ్రెస్ నేతలు కూడా జైలుకు వెళ్లి బెయిలు తెచ్చుకున్నారని, అంతమాత్రాన కోర్టుపై అవినీతి అభాండాలు వేస్తారా? దీనిపై పార్టీ నాయకత్వంతో చర్చించి న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు.