హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): సాగునీటిపారుదల రంగంపై అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పి.. ప్రభుత్వమే అందుకు సిద్ధంగా లేమని చెప్పటమేమిటని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చర్చకు సిద్ధంకాలేదని ఎలా చెప్తారని నిలదీశారు. నీటిపారుదల రంగంపై శ్వేతపత్రాన్ని ప్రకటిస్తామని అసెంబ్లీ ఎజెండాలో పెట్టిన ప్రభుత్వం, చర్చకు ఎందుకు వెనకాడుతున్నదని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో బీసీ జనగణనపై చర్చ అనంతరం సభను టీ విరామానికి వాయిదా వేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ చర్చలకు ఆహ్వానించారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ సభ్యులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు. నీటిపారుదల రంగంపై శనివారం చర్చిద్దామని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకు విపక్షాలు తిరస్కరించాయి. శుక్రవారం ఆర్ధరాత్రి వరకైనా చర్చిద్దామని పట్టుబట్టాయి. కానీ, చర్చకు ప్రభుత్వం నిరాకరించింది. శ్వేతపత్రం ప్రకటన, చర్చను శనివారం చేపట్టనున్నట్టు ప్రకటించి అసెంబ్లీని వాయిదా వేశారు.
అసెంబ్లీ ఎజెండాలో పెట్టిన అంశంపై ప్రభుత్వమే చర్చకు వెనుకాడటం ఏమిటని విపక్షాలు నిలదీశాయి. శుక్రవారం కాకపోతే ఈ అంశంపై మేడారం జాతర అనంతరం 25వ తేదీ తరువాత చర్చ పెట్టాలని, అప్పటి వరకు వాయిదా వేయాలని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు సూచించారు. కానీ, ఈ సూచనను ప్రభుత్వం పట్టించుకోలేదు. సభ్యులంతా చర్చలో పాల్గొని నీటిపారుదల రంగంపై కూలంకషంగా చర్చించేందుకు సభను శనివారానికి వాయిదా వేయాలని విప్ బీర్ల అయిలయ్య స్పీకర్ను కోరారు. అందుకు హరీశ్రావు అభ్యంతరం తెలిపారు. రాత్రి ఎంత సమయం అయినా చర్చిద్దామని అన్నారు. అసెంబ్లీ ఎజెండాలో పెట్టిన అంశాలపై చర్చకు ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఉదయం నుంచి చర్చ కోసం వేచి చూస్తున్నామ తెలిపారు.
బీజేపీ పక్ష నేత మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలు ఉన్నందున ఇప్పుడే చర్చిద్దామంటూ పట్టుబట్టారు. ఇరిగేషన్పై చర్చకు ఎందుకు వెనకు పోతున్నారని నిలదీశారు. మంత్రి ఉత్తమ్ ప్రిపేర్ కాలేదా? అని ఏద్దేవా చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని గతంలో సీఎం రేవంత్రెడ్డి డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేత హైకోర్టులో కేసు కూడా వేశారని తెలిపారు. సీబీఐకి ఇవ్వడానికి ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్తున్నారని నిలదీశారు. అయితే ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ మాత్రం శనివారం చర్చిద్దామని, సభను వాయిదా వేయాలని కోరారు. దీంతో సభను స్పీకర్ శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.
సభలో లేని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. అప్పటివరకు నీటిపారుదల రంగంపై చర్చలో తమ అభిప్రాయాన్ని చెప్పబోమని తేల్చి చెప్పారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రకటించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రేవంత్రెడ్డి సీఎంను కాల్చిపారేయ్యాలని, ఉరి తీసినా తప్పు లేదంటూ అభ్యంతరకరంగా మాట్లాడారని, వాటి గురించి ఏ సమాధానం చెప్తారని హరీశ్రావు నిలదీశారు.