నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన హోల్ సేల్ చేపల మార్కెట్ ను నిర్మించడానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారుఉలను ఆదేశించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు పలు సమస్యలపై మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్య శాఖకు చెందిన స్థలంలో అత్యాధునిక హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ను మంత్రి ఆదేశించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ తో పాటి ఇతర నీటి వనరుల ద్వారా పెద్ద ఎత్తున చేపల ఉత్పత్తి జరుగుతుందని, ఇక్కడ చేపల మార్కెట్ నిర్మాణం జరిగితే ఈ పరిసర ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కూడా చేపట్టడం వలన పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేసే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా ఈ ప్రాంతం మత్స్య రంగానికి ఒక హబ్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పారు.
మత్స్యాకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేశిని మల్లయ్య, పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.