యాదగిరిగుట్ట: రుణమాఫీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులనే కాదు.. దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రులేమో తలో మాటా మాట్లాడుతున్నారని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం పార్టీ నాయకులతో కలిసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ఇంకా 17 లక్షల మందికి మాఫీ చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారన్నారు. రుణమాఫీ ఇంకా పూర్తికాలేదని పొంగులేటి అంటున్నారని చెప్పారు. రుణమాఫీకి మరో రూ.12 వేల కోట్లు ఇంకా ఇవ్వాలని అంటున్నారని వెల్లడించారు.
రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయాలని మంత్రి తుమ్మల చెప్పారు. ఇప్పటివరకు 22 లక్షల మందికి రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశామన్నారు. తుమ్మల లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకుగాను 22 లక్షల మందికే మాఫీ అయ్యింది. అంటే ఇప్పటివరకు 45 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఇంకా 54 శాతం మంది రైతులకు మాఫీ డబ్బు బ్యాంకుల్లో జమచేయాలి. మరి మంత్రుల లెక్కల ప్రకారం రాజీనామా ఎవరు చేయాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని నీతి, నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏ దేవుళ్లపై ఒట్లు పెట్టారో ఆ దేవుళ్ల వద్దకు వెళ్లి రేవంత్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాయని చెప్పారు. పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టం అని బ్రాహ్మణ ఉత్తములు చెప్పారు. అందుకే ప్రజలకు అరిష్టం కలుగకుండా పాపం చేసిన సీఎంను క్షమించాలని మొక్కుకున్నా. ప్రజలను రక్షించాలని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని వేడుకున్నాని చెప్పారు. రైతులందరికి రుణమాఫీ, పంటల బోనస్ ఇచ్చేంత వరకూ పోరాడే శక్తిని ఇవ్వాలని వేడుకున్నానన్నారు.
సీఎం సొంతూరులో మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యం చేశారని విమర్శించారు. రేవంత్ సర్కార్ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. కేసులు, బెదిరింపులతో రైతుల ఆగ్రహాన్ని ఆపలేరన్నారు. ప్రజారాజ్యమని రేవంత్ గప్పాలు కొట్టారని, రైతులు తమ బాధలు చెప్పుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. అందరికి రుణమాఫీ చేసేవరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని స్పష్టం చేశారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వానికి కొమ్ముకాయొద్దని సూచించారు.
Live : Former Minister, MLA @BRSHarish speaking to media in Yadagirigutta. https://t.co/6b80iB0aLl
— BRS Party (@BRSparty) August 22, 2024