(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చ్17(నమస్తే తెలంగాణ): పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం)లో తాను అదనపు సంచాలకుడినని గొప్పలు చెప్పుకొన్న ఓ మోసగాడు జెడ్ ప్లస్ సెక్యూరిటీతో కశ్మీర్లో అధికార దర్పం ప్రదర్శించాడు. ప్రభుత్వ ఉన్నతోద్యోగులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాడు. ఏకంగా జమ్ము కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా సమావేశమయ్యాడు. కశ్మీర్ లోయలో జెడ్ ప్లస్ సెక్యూరిటీతో, బుల్లెట్ ప్రూఫ్ కారులో, సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించాడు. ఫైవ్ స్టార్ హోటల్ వసతితో పాటు అన్ని అధికారిక రాజభోగాలు అనుభవించాడు. కానీ వారం తిరక్కుండానే మళ్లీ పర్యటనకు వెళ్లడంతో ఓ అధికారికి అనుమానమొచ్చింది. నిఘా పోలీసులకు ఉప్పందించడంతో బండారం బయటపడింది. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కు చెందిన ఈ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జమ్ము కశ్మీర్ పోలీసుల కథనం ప్రకారం కిరణ్ భాయి పటేల్ గత ఏడాది అక్టోబర్ 27 న భార్య, పిల్లలతో ‘అధికారికంగా’ మొదటిసారి జమ్ము కశ్మీర్లో పర్యటించాడు. ఆ తర్వాత మరోసారి ముగ్గురు మిత్రులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లాడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపాడు. అయితే రెండో వారంలోనే తిరిగి పర్యటనకు రావడంతో ఓ ఐఏఎస్ అధికారికి అనుమానం వచ్చి అతడిపై విచారణ జరిపించాడు. దీంతో అసలు మోసం బయటపడింది. అతడు నకిలీ అధికారి అని తేలడంతో అతడిని బస చేసిన హోటల్లో ఈ నెల 2న అరెస్టు చేశారు. అయితే అతడి వెంట వచ్చిన అమిత్ హితేష్ పాండియా, జే.సీతాపరా, త్రిలోక్ సింగ్ మాత్రం పోలీసుల నుంచి తప్పించుకున్నారు. కిరణ్ భాయి పటేల్ తన ట్విట్టర్ ఖాతాలో తనను తాను పీహెచ్డీ చేసిన విద్యావంతుడిగా, వ్యూహకర్తగా, విశ్లేషకుడిగా అభివర్ణించుకున్నాడు. పటేల్కు ధ్రువీకరించిన ట్విట్టర్ ఖాతా ఉండటం, అతడిని అనుసరించే వారిలో గుజరాత్కు చెందిన పలువురు ప్రముఖ సీనియర్ బీజేపీ నేతలు కూడా ఉండటం గమనార్హం.