హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కుల సంఘాల కార్పొరేషన్లకు అదనంగా మరో 16 బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కార్పొరేషన్ల ఏర్పాటుతో అత్యంత వెనుకబడిన బీసీ, ఈబీసీ కులాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పు తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సాయంత్రం సచివాలయంలో మంత్రిమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. మంత్రిమండలి నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాకు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్పొరేషన్లలో ముదిరాజ్, యాదవకురుమ, మున్నూరుకాపు, పద్మశాలి, పెరిక(పురగిరి క్షత్రియ), లింగాయత్, మేరు, గంగపుత్ర కార్పొరేషన్లతోపాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు, ఆర్యవైశ్య, రెడ్డి, మా దిగ, మాదిగ ఉపకులాలు, మాల, మాల ఉపకులాలు, మూడు ప్రత్యేక కార్పొరేషన్లు.. కు మ్రంభీం ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడీ, ఏకలవ్య (ఎరుకల) కార్పొరేషన్లు ఏర్పాటు చే యబోతున్నట్టు వివరించారు.
కాళేశ్వరం.. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతిపై విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకిని చంద్రఘోష్, కొత్తగూడెం, భ ద్రాద్రి విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు, చత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లలో అవకతవకలు, అవినీతిపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో వేర్వేరుగా రెండు వి చారణ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేసిం ది. ఈ రెండూ వంద రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఆరు గ్యారెంటీలలో కొన్ని అమలు చేశామని, మిగ తా వాటికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని మంత్రులు వివరించారు.
తెల్ల రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు
అర్హులైన అందరికీ తెల రేషన్కార్డులు జారీచేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొదటి దశలో ఇంటిస్థలం ఉండి, తెల్లరేషన్కార్డు కలిగిన వారిని మాత్రమే లబ్ధిదారులుగా పరిగణిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 3,600 చొప్పున ఇండ్లకు 22,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపికచేస్తారు.
2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు
2008 డీఎస్సీ ఉపాధ్యాయ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవాలని క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టైం స్కేల్ ప్రకారం తక్షణమే వారిని నియమించాలని నిర్ణయించింది. ఇప్పటికే 84 శాతం మంది రైతులకు రైతుబంధు ఇచ్చామని, మరో రెండు రోజుల్లో 93 శాతంమంది రైతులకు రైతుబంధు నగదు జమచేయాలని నిర్ణయించినట్టు మంత్రులు వెల్లడించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారయ్యే ఉత్పత్తుల బ్రాడింగ్, మార్కెటింగ్ కోసం ఓఆర్ఆర్ చుట్టూ 30 ఎకరాలు కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయించింది. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ను ఆదేశించినట్టు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఆరోగ్యశ్రీ, రేషన్కార్డుల జారీకి అర్హుల ఎంపికకు నిబంధనలను రూ పొందించాలని ఆదేశించినట్టు వివరించారు.
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, ఉర్దూ జర్నలిస్ట్ ఆమిర్అలీఖాన్ పేర్లను తిరిగి గవర్నర్కు సిఫారసు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ధరణిపై సిట్!
మంత్రిమండలిలో ఎక్కువ సేపు ధరణిపైనే చర్చ జరిగినట్టు తెలిసింది. ధరణి వెబ్సైట్ ద్వారా జరిగిన అవకతవకలపై అంతర్గత విచారణకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పా టు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు తెలిసింది. భూములకు పట్టాలు పొంది న వాటిపై అధ్యయనం చేయనున్నారు.
సీజేగా జస్టిస్ నరసింహారెడ్డికి అనుభవం
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, ఒప్పందాలపై విచారణకు ప్రభు త్వం నియమించిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గవిచర్ల. జనవరి 2015 నుంచి అదే ఏడాది జూలై 31 వరకు పాట్నా హైకోర్టు సీజేగా పనిచేశారు.
తొలి లోక్పాల్ జస్టిస్ పినాకిని చంద్రఘోష్
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు అంశంపై న్యాయవిచారణ కోసం ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకిని చంద్రఘోష్ 1952లో కలకత్తాలో జన్మించారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా, బెంగాల్, అండమాన్ అండ్ నికోబారా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గానూ పనిచేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అండ్ రీసెర్చ్కు కులపతిగా వ్యవహరించారు. 2019లో దేశ తొలి లోక్పాల్గా జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నియమితులయ్యారు.
ప్రజాస్వామ్య ఆనవాళ్లతో రాష్ట్ర చిహ్నం
ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను ప్రతిబింబించడంతోపాటు రాష్ట్ర సంసృతి, సంప్రదాయాలు కనబడేలా రాష్ట్ర చిహ్నం ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. రాష్ట్ర చిహ్నం, విగ్రహం, గీతం ఖరారు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక, కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సామాన్య మహిళను గౌరవించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు. ప్రముఖ కవి అందెశ్రీతో రాష్ట్ర గీతంపై చర్చించి సమకాలీన కాలానికి అణుగుణంగా జయజయ హే పాటకు కొన్ని మార్పులు చేర్పులు చేయాలని తెలిపారు. ప్రముఖ కళాకారులు, మేధావులతో రాష్ట్ర చిహ్నం, విగ్రహానికి సంబంధించిన డిజైన్లను రూపొందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతం, రాష్ట్ర విగ్రహంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉండాలని పేర్కొన్నారు.
వేం నరేందర్రెడ్డిని కలిసిన గుత్తా అమిత్రెడ్డి
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్రెడ్డి మంగళవారం ఉదయం ప్రభుత్వం సలహాదారు వేం నరేందర్రెడ్డిని కలవడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అమిత్రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరగ్గా, అలాంటిదేమీ లేదని ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన వేం నరేందర్రెడ్డిని కలవడంతో పార్టీ మార్పు ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టు అయింది.