హైదరాబాద్ : తెలంగాణ ఆఫ్ఘనిస్తాన్ అయితే.. ఇక్కడ షర్మిల ఎందుకు ఉంటున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రశ్నించారు. ఎంపీ మాలోత్ కవితతో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో విష నాగులు తిరుగుతున్నాయని, షర్మిల ప్రస్థానం ఎటు వైపు అని, ఏ లక్ష్యంతో పాదయాత్ర చేస్తుందని నిలదీశారు. తెలంగాణ వ్యతిరేక భావాన్ని షర్మిల కొనసాగిస్తుందని ఆరోపించారు. ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు షర్మిలను గౌరవించారని, ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. 2004లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను షర్మిల తండ్రి.. వైఎస్సార్ కొనుగోలు చేశారని మండిపడ్డారు.
ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, దీనిపై షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదని, అక్కడి సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. షర్మిల వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో త్వరలోనే బయటపెడుతామన్నారు. తండ్రిలాగే అధికారం వస్తుందని షర్మిల పాదయాత్ర చేపట్టిందని, నాటి ఆంధ్రా పాలకుల వైఖరిని తెలంగాణలో అనుసరిస్తున్నారని విమర్శించారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటుందని, దేశంలో అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.
కుట్రలు చేస్తూ తెలంగాణను ఆగం చేయాలని షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చ లేదని, దీనిపై స్పందించారా? అని నిలదీశారు. బయ్యారం ఉక్కు ఫ్యాకరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీపై షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైఎస్ జగన్, కేవీపీ ఇద్దరు తెలంగాణ వద్దని పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకున్నారని, తెలంగాణ అభివృద్ధి షర్మిలకు ఇష్టం లేదన్నారు. ఇప్పుడు ఓదార్పు యాత్రలు ఏపీకి అవసరమని, అక్కడ పాదయాత్ర చేపట్టాలని సూచించారు.
తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదన్నారు. షర్మిలను అడ్డుకున్నది మహిళలే అని గుర్తించాలని, పాదయాత్రకు అడ్డు చెప్పలదేన్నారు. తెలంగాణలో విషపు బీజాలు నాటడానికి షర్మిల ప్రయత్నం చేస్తున్నారని, ఆమె ఆటలు సాగవన్నారు. తెలంగాణలో అధికారం కోసం షర్మిల కుట్రలు చేస్తున్నారని, తెలంగాణ సమాజం గురించి తెలుసుకుని షర్మిల వ్యవహరించాలని సూచించారు. పోలీసులను ఆర్ఎస్ఎస్తో పోల్చారని, ఆ విధానం షర్మిలకు తెలుసని, తమకు తెలియదన్నారు. టీఆర్ఎస్పై మానసిక దాడి చేస్తున్నారని, దీన్ని చూస్తూ ఎలా ఉండాలని ప్రశ్నించారు.