Oil Palm | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాధారణ అటవీ ప్రాంతానికి తోడుగా మరో కొత్త అటవీ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ ఆయిల్పాం’ పథకం ఈ కొత్త అడవిని సృష్టిస్తున్నది. ఇది చదువుతున్నప్పుడు ఆయిల్పాం సాగుకు, అటవీ అభివృద్ధికి సంబంధమేమిటి? అనే ప్రశ్న తలెత్తడం సహజం. కానీ, ఈ రెండింటికీ సంబంధం ఉన్నది. పర్యావరణానికి అడవులు ఎంత ముఖ్యమో.. ఆయిల్పాం చెట్లకూ అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. సాధారణ చెట్లతో పోల్చితే ఆయిల్పాం చెట్లు పర్యావరణానికి ఎక్కువ మేలు చేస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. అందుకే ఆయిల్పాం చెట్లను ‘పర్యావరణ ఊపిరితిత్తులు’ (లంగ్స్ ఆఫ్ ఎకోసిస్టమ్)గా పిలుస్తారు.
ఎక్కువ కార్బన్డయాక్సైడ్ను గ్రహించి అధిక ఆక్సిజన్ను ఇచ్చే చెట్టును పర్యావరణ కోణంలో మంచి చెట్టుగా పరిగణిస్తారు. సాధారణ చెట్లతో పోల్చితే ఆయిల్పాం చెట్లు ఎక్కువ కార్బన్డయాక్సైడ్ను గ్రహించి, అధిక మొత్తంలో ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. పలు దేశాల్లో జరిగిన పరిశోధనల ప్రకారం.. సాధారణ చెట్లతో కూడిన అటవీ ప్రాంతం సంవత్సరానికి హెక్టారుకు 42.4 టన్నుల కార్బన్డయాక్సైడ్ను గ్రహిస్తుంది. అంతే విస్తీర్ణంలోని ఆయిల్పాం చెట్లు 64.5 టన్నుల కార్బన్డయాక్సైడ్ను గ్రహిస్తాయి. సాధారణ అటవీ ప్రాంతంతో పోల్చితే ఆయిల్పాం చెట్లతో కూడిన ప్రాంతం 22.1 టన్నుల కార్బన్డయాక్సైడ్ను అధికంగా స్వీకరించడం గమనార్హం. సాధారణ అటవీ ప్రాంతం సంవత్సరానికి హెక్టారుకు 7.09 టన్నుల ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఆయిల్పాం సాగు ప్రాంతం 18.70 టన్నుల ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. సాధారణ అటవీ ప్రాంతంతో పోల్చితే ఆయిల్పాం చెట్లతో కూడిన ప్రాంతం 11.61 టన్నుల ఆక్సిజన్ను అధికంగా విడుదల చేస్తున్నది. ఈవిధంగా అధిక కార్బన్డయాక్సైడ్ను స్వీకరించి, అధిక ఆక్సిజన్ను విడుదల చేస్తూ పర్యావరణ పరిరక్షణకు ఆయిల్పాం చెట్లు దోహదపడుతున్నాయి. అంతేకాదు, పలు పంటల సాగుతో పోల్చితే ఆయిల్పాం సాగుకు తక్కువ నీరు, తక్కువ ఎరువులు అవసరం. ఒక ఎకరం వరి సాగు కోసం అవసరమయ్యే సాగునీటితో నాలుగు ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయొచ్చు. వరదల సమయంలో నేలలోని మృత్తికలు కొట్టుకుపోకుండా కాపాడుతాయి. ఆయిల్పాం సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురుస్తాయని పరిశోధనలో తేలింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పాం సాగును ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు సుమారు 1.60 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగైంది. ఈ లెక్కన రాష్ట్రంలో 1.60 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం అడవి అభివృద్ధి చెందినట్టయ్యింది. ఆయిల్పాం సాగుతో రైతులకు లాభసాటి పంట అందుబాటులోకి రావడంతోపాటు పర్యావరణానికీ మేలు జరుగుతున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించేందుకు హరితహారం పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే 290 కోట్లకు పైగా మొక్కలు నాటించింది. దీంతోపాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో పచ్చదనం పెంపుదలకు కృషి చేస్తున్నారు. ఈవిధంగా దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం అకుంఠిత దీక్షతో పని చేస్తుండటం విశేషం.