హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకులు దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని.. మరి ఏడేండ్లకు కలిపి 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతల వైఖరి దొంగలే దొంగా దొంగా అన్నట్టుగా ఉన్నదని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి , నోముల భగత్, టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డితో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ విషయంలో బీజేపీ నాయకులను తెలంగాణ యువత నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటికి ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తలేదో బీజేపీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా ఉండే 35 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి బడుగు, బలహీనవర్గాలను రోడ్డున పడేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు ఆప్షన్లు, బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నదని, ఈ ప్రక్రియ పూర్తికాగానే కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువడుతాయని చెప్పారు. తెలంగాణ యువత బీజేపీ ప్రకటనలతో మోసపోకుండా ఉద్యోగాల కోసం సిద్ధం కావాలని సూచించారు. ఇప్పటికే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను గుర్తించినట్టు వివరించారు. రాష్ట్ర బీజేపీ నేతలు గుజరాత్ గులాంలుగా మారారని ఎద్దేవా చేశారు. వారికి చీము, నెత్తురు లేదని ఫైర్ అయ్యారు.
తెలంగాణపై పగ
తెలంగాణపై బీజేపీ పగబట్టినట్టు వ్యవహరిస్తున్నదని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదని, చేనేతపై జీఎస్టీని పెంచిందని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ రాకుండా చేసిందని అన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నదని బాల్క సుమన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వటానికి సిద్ధమైందన్న విషయం తెలిసే బీజేపీ నేతలు దీక్ష చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేస్తుంటే రేవంత్ ఏం చేశారని ప్రశ్నించారు.