ప్రియమైన మోదీ..
కేంద్రంతో ముడిపడి ఉన్న మా సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు? మాకేం ఒరగబెట్టావ్ మోదీ? అడుగుతున్నది.. సింగరేణి కార్మికలోకం!
తెలుగు రాష్ర్టాల మధ్య జలవివాదాలు ఎందుకు పరిష్కారం కావడం లేదు? ఎనిమిదేండ్లుగా ఏం చేస్తున్నావ్ మోదీ.. అడుగుతున్నది.. తెలంగాణ రైతాంగం!
యావత్ తెలంగాణ సమాజం నిలదీస్తున్నది.. తమ సమస్యలపై జవాబు చెప్పాలని.. యావత్ తెలంగాణ ప్రజ ప్రశ్నిస్తున్నది.. మాకేం చేశారని.. కేంద్రం సహకరించకపోయినా.. నిధులు ఇవ్వకున్నా.. రుణాలు రాకుండా అడ్డుకొన్నా.. సమస్యలొచ్చినా.. సంక్షోభం తలెత్తినా.. దిగులుపడకుండా.. వెనుకడుగు వేయకుండా ఉన్న వనరులతోనే.. ఒక్కటొక్కటిగానే కూడగట్టుకొంటూ తెరిపిన పడుతున్న కొత్త రాష్ట్రం తెలంగాణపై ఇంత అసూయ, ద్వేషం దేనికని సబ్బండ వర్ణాలు ప్రశ్నిస్తున్నాయి. రైతు చట్టాలు తెచ్చి రైతుల ఆందోళనకు కారణమయ్యారు. కార్మిక చట్టాలతో కార్మికుల ఆగ్రహానికి గురవుతున్నారు. నీటి వివాదాలు పరిష్కరించక, విభజన సమస్యలు తేల్చక.. కనీసం విభజన హామీలలో ఒక్కటైనా నెరవేర్చకుండా.. ఎందుకొస్తున్నారని తెలంగాణ ప్రశ్నిస్తున్నది. జనాబ్.. జవాబ్ దో.. ప్రియమైన మోదీ!
కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గోదావరిఖని, నవంబర్ 10: సింగరేణిని నిర్వీర్యం చేయాలని కేంద్రం కుట్రలు పన్నుతున్నదని కార్మికలోకం మండిపడుతున్నది. సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న సింగరేణిపై కేంద్రం వేటువేయాలని చూస్తున్నదని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నది. సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో నష్టాలబాట పట్టి, ఒక దశలో బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్) కోరల్లోకి వెళ్లి వచ్చిన నల్లబంగారు గని.. తెలంగాణ వచ్చినంక సి రుల సింగరేణిగా మారింది. బొగ్గు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్, లాభాలు, ఉద్యోగాల నియామకాలు ఇలా అనేక అంశాల్లో పురోగమిస్తున్నది. కానీ, ఈ సంస్థలో 49% వాటా ఉన్న కేంద్రం విషం చిమ్ముతున్నదని కార్మికులు అంటున్నారు. కేంద్రంతో ముడిపడిన ఏ ఒక్క డిమాండ్ను మోదీ సర్కారు పరిష్కరించలేదని ఆగ్రహిస్తున్నారు. శనివారం తెలంగాణకు వస్తున్న మోదీ తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, లేకపోతే నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఆదాయ పన్ను మినహాయింపు ఎప్పుడు?
తెలంగాణ వచ్చిన వెంటనే.. తొలి అసెంబ్లీ సమావేశంలోనే సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానం కేంద్రానికి పంపి ఎనిమిదేండ్లు గడుస్తున్నా మోదీ ప్రభుత్వానికి ఉలుకూపలుకూ లేదు. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కూడా ప్రయత్నించలేదు. కార్మిక సంఘాల ఎన్నికలప్పుడు మాత్రం ఈ అంశం కేం ద్రం పరిశీలనలో ఉన్నదని చెప్తారని అంటున్నారు. ఈ అంశంపై జాతీయ కార్మిక సంఘాలు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కో ల్బెల్ట్కు చెందిన ఎంపీలు పార్లమెంట్లో పోరాటాలు చేస్తూనే ఉన్నా రు. తమ ప్రాంతానికి వస్తున్న క్రమంలోనైనా ప్రధాని ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని కార్మికలోకం డిమాండ్చేస్తున్నది.
వాటా కొనుగోలుపై సమాధానం ఏది?
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేం ద్రానికి 49 శాతం వాటాలున్నాయి. స్వరాష్ట్రం వచ్చా క సింగరేణిని బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా ముఖ్యమంత్రి దూరదృష్టితో అనేక వాణిజ్య, వ్యాపార రంగాలకు విస్తరింపజేశారు. మరింత విస్తరణకు ఉజ్వల అవకాశాలు ఉన్నప్పటికీ కేంద్రం అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తున్నది. ఈ విషయాన్ని గ్రహించే సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కేంద్రం వాటాను కొనడానికి సిద్ధంగా ఉన్నామని మోదీకి లేఖ రాశారు. కేంద్రం స్పందించలేదు. గడిచిన ఎనిమిదేండ్లలో పన్నులు, సెస్సులు, లాభాల రూపంలో కేంద్రానికే రూ.22,732.53 కోట్లను సింగరేణి ముట్టజెప్పింది. సింగరేణికి అండగా ఉండకపోగా.. కనీసం వాటా కొంటామని చెప్పినా ఎందుకు స్పందించడం లేదో స్పష్టంచేయాలని కార్మికులు అడుగుతున్నారు.
వేతన ఒప్పందాల్లోనూ జాప్యమే..
బొగ్గుగని కార్మికులకు ఐదేండ్లకోసారి అమలు కావాల్సిన వేతన ఒప్పందాలు కూడా ఏండ్ల తరబడి జాప్యం జరుగుతున్నాయి. వేజ్బోర్డ్ సమావేశాలను తరచూ జాప్యం చేయడమే కాకుండా.. అలవెన్సులు, ఇతర ఆదాయాలకు కేంద్రం గండికొడుతున్నది. 2021 జూలై నుంచి అమలు కావాల్సిన వేతన ఒ ప్పందం ఇప్పటికే 17 నెలలు ఆలస్యమైంది. 11వ వేతన ఒప్పందంలో అనుకున్న వేతనాలు పెరగకుం టే ఆందోళన తప్పదని కార్మికులు హెచ్చరిసున్నారు.
పైసా పెంపుదల లేని పెన్షన్
బొగ్గుగని కార్మికులకు రెండు దశాబ్దాలుగా పెన్షన్లో పెరుగుదల లేదు. పెన్షన్ ఫండ్ లోటు పేరుతో 25% గానే పెన్షన్ చెల్లిస్తూ వస్తున్న కేంద్రం.. ఇటీవల పెన్షన్ ఫండ్కు గతంలో కంటే రెట్టింపు మొత్తంలో కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నది. అయినా పెన్షన్ పెరిగింది లేదు. కొందరు కార్మికులకు రూ.500 నుంచి వెయ్యి లోపే పెన్షన్ వస్తున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బేసిక్పై 25% పెన్షన్ను పెంచాలని కార్మికులు కోరుతున్నారు.
కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం
దేశంలో కార్మిక చట్టాలను మార్చే యత్నాలతో సింగరేణిలో కార్మిక వర్గం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. 42 కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్లుగా కార్మిక చట్టాలను అమలు చేయాలని చూస్తున్న కేంద్రం వైఖరిపై మండిపడుతున్నాయి. మోదీ ప్ర భుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై టీబీజీకేఎస్తోపాటు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్లతోపాటు విప్లవ కార్మిక సంఘాలు అందోళనలకు సిద్ధమవుతున్నాయి.
పెంచిన వయోపరిమితిపై ఆంక్షలు
సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులకు 61 ఏం డ్లకు రిటైర్మెంట్ వయస్సును పెంచారు. సింగరేణిలో 60 ఏండ్లుగా ఉన్న రిటైర్మెంట్ ఏజ్ మరో ఏడాది పెరగటంతో అ ఏడాదికి సంబంధించిన పెన్షన్ పెరుగుదల, సీఎంపీఎఫ్ అమలు చేయలేమని కేంద్రం చెప్పటంతో కార్మిక వర్గం అగ్రహం వ్యక్తం చేస్తున్నది.
ముఖ్యమంత్రి సహకారంతో సంక్షేమ ఫలాలు
సీఎం కేసీఆర్ కోలిండియాలో లేని అనేక హక్కులను సింగరేణిలో కల్పించారు. వారసత్వ ఉద్యోగాల కల్పన, లాభాల్లో కార్మికులకు 10% ఉన్న వాటాను 30% పెంపు, రిటైర్మెంట్ వయసు 61ఏండ్లకు పెంపు, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వటం, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యాలు కల్పించడం, కార్మికుల నుంచి ఒక శాతం విద్యుత్తు బిల్లులను రద్దు చేయడం లాంటి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. 2013-14లో రూ.11.9 వేల కోట్లుగా ఉన్న టర్నోవర్ 2021-22లో రూ.26 వేల కోట్లకు పెరగటం స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతికి నిదర్శనం. అపరిష్కృతంగా ఉన్న కారుణ్య నియామకాలు ఇతర రిక్రూట్మెంట్లు కలిపి దాదాపు 17వేల పైచిలుకు ఉద్యోగాలను స్వరాష్ట్రంలో కల్పించింది.
‘సింగరేణి’లో ప్రైవేటీకరణకు కుట్ర
దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి నిర్ణయించిన మోదీ సర్కార్.. సింగరేణికి సంబంధించి 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడంపై కార్మికలోకం సంఘాలకు అతీతంగా కన్నెర్ర చేసింది. అయినా మోదీ ప్రభుత్వం మొండిగా ముందుకు సాగింది. అభివృద్ధి పథంలో సాగటమేకాదు, ఎన్ని బ్లాక్లు ఇచ్చినా ఉత్పత్తిచేయగల సత్తా ఉన్న సింగరేణికి కొత్త బొగ్గు గనులు ఇవ్వకపోవడం కేంద్రం ప్రైవేటీకరణకు కుట్రలకు నిదర్శనంగా నిలుస్తున్నదని కార్మికులు విమర్శిస్తున్నారు.