హైదరాబాద్: ఇండియాలోని బీబీసీ ఆఫీసులపై ఇవాళ ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో స్పందించారు. ఆ దాడుల పట్ల ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితమే ప్రధాని మోదీపై బీబీసీలో డాక్యుమెంటరీ ప్రసారం అయ్యిందని, ఇప్పుడు భారత్లోని బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు నవ్వులపాలు అవుతున్నాయని, ఆ సంస్థలు బీజేపీ కీలుబొమ్మలుగా మారినట్లు కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్.. తర్వాత ఎటువంటి చర్యను తీసుకుంటారని అడిగారు. అదానీ స్టాక్స్పై నివేదిక ఇచ్చిన హిండెన్బర్గ్ సంస్థపై ఐటీ దాడి చేయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. లేదంటే ఆ సంస్థనే టేకోవర్ చేసుకుంటారా అని ఆయన విమర్శించారు.బీబీసీపై ఐటీ రెయిడ్స్కు సంబంధించి వివిధ మీడియా సంస్థలు రాసిన కథనాలను తన ట్వీట్లో మంత్రి ట్యాగ్ చేశారు.
What a surprise!! 😁
A few weeks after they aired the documentary on Modi, BBC India now raided by IT
Agencies like IT, CBI and ED have become laughing stock for turning into BJP’s biggest puppets
What next? ED raids on Hindenberg or a hostile takeover attempt? pic.twitter.com/yaZ4ySw88f
— KTR (@KTRBRS) February 14, 2023
ముంబై, ఢిల్లీల్లో ఉన్న బీబీసీ కార్యాలయాల్లో ఇవాళ ఐటీ శాఖ తనిఖీలు జరుగుతున్నాయి.ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో అక్రమాలు జరిగినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీపై ఐటీశాఖ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కొన్ని వర్గాలు ద్వారా తెలిసింది.
ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో సుమారు 20 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. ముంబైలో ఉన్న బీబీసీ స్టూడియోస్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్లను సీజ్ చేశారు. జర్నలిస్టుల ఫోన్లు, ల్యాప్టాప్లను లాగేసుకున్నారు. సర్వే కోసం ఆఫీసును సీల్ చేసినట్లు చెప్పారు. ఎటువంటి వివరాలను బయటకు వెల్లడించరాదు అని ఉద్యోగులకు ఆదేశించారు. బీబీసీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న బ్యాలెన్స్ షీట్, అకౌంట్ల వివరాలను సేకరిస్తున్నట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు.
ఢిల్లీ, ముంబైల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల వద్ద ఐటీశాఖ అధికారులు ఉన్నారని బీబీసీ తన ట్విట్టర్లో తెలిపింది. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఆ సంస్థ చెప్పింది. వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించనున్నట్లు బీబీసీ తన ట్వీట్లో వెల్లడించింది.
The Income Tax Authorities are currently at the BBC offices in New Delhi and Mumbai and we are fully cooperating.
We hope to have this situation resolved as soon as possible.
— BBC News Press Team (@BBCNewsPR) February 14, 2023