కుభీర్, జనవరి11: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్షంగా కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి అదిలాబాద్ నేతలకు సూచించారు. హైదరాబాద్లో కేటీఆర్, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపే లక్ష్యంగా నాయకులు కృషి చేయాలని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా పెద్దగా చేసింది ఏమిలేదన్న విషయాన్ని నగర ప్రజలకు అవగాహన కల్పించాలని కేటీఆర్ చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇంకేమీ చేయలేదని కేటీఆర్ విమర్శించారు. సీఎంకు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కేటీఆర్ కోరినట్లు ఉమ్మది అదిలాబద్ జిల్లా నేతలు తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించి భైంసా మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలన్నట్లు కార్యనిర్వాహక అధ్యక్షుడు దిశా నిర్దేశం చేసినట్లు నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, విలాస్ గాదెవార్, డా. పడకంటి రమాదేవి, లోలం శ్యాంసుందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.