హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నదీ ఈ నెల 16లోగా తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సీఎం, ప్రతిపక్ష నేత ఇతరులతో కూడిన కమిటీ తీసుకున్న నిర్ణయాలను తెలపాలని కోరింది. హక్కుల కమిషన్కు చైర్మన్ను, సభ్యులను నియమించడంలేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది హరేందర్ పరిషద్ మాట్లాడుతూ.. చైర్మన్ పోస్టుకు 4, జ్యుడీషియల్ సభ్యుల పోస్టుకు 10, నాన్ జ్యుడీషియల్ సభ్యుల పోస్టుకు 64 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. వారిలో అర్హులైన వారిపై ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. ఆ వివరాలు తెలిపేందుకు వారం గడువు కావాలని కోరారు.