Jamili Elections |స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, సెప్టెంబర్ 4, (నమస్తే తెలంగాణ): ఇంతకు ఢిల్లీలో ఏమి జరుగుతున్నది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఏం చేయబోతున్నారు. దీని మీద మిస్టరీ ఇంకా వీడటం లేదు. ముందస్తు ఆలోచనే కేంద్రానికి లేదని, కొన్ని రాష్ర్టాలలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయబోమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్తున్న మాటలను ఎవరూ నమ్మడం లేదు. బీజేపీలో ఠాకూర్ చిన్న వ్యక్తి. ఇంతటి కీలకమైన అంశంపై వివరణ ఇచ్చే స్థాయి ఆయనకు లేదు. నిజంగానే ముందస్తు ఆలోచన లేకపోతే ఆ ప్రకటన అమిత్షా, రాజ్నాథ్సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేకపోతే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డానో చేసేవారు. కానీ వారెవ్వరూ మాట్లాడకుండా అనురాగ్ ఠాకూర్తో ప్రకటన చేయించడం కూడా మీడియా, రాజకీయ పార్టీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ ముందస్తు ఆలోచనే కేంద్రానికి లేకపోతే ఇంత ఆదరాబాదరాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ సమావేశాలు నిర్వహించడం పట్ల జరుగుతున్న ప్రచారంపై వినిపిస్తున్న, కనిపిస్తున్న కారణం పార్లమెంట్లో మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టడానికేనని కొన్ని వర్గాల వాదన. ఈ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయని భావిస్తున్నారు. ఆ సందర్భంగా ఎంపీలకు భారీ ఎత్తున స్వాగత సత్కారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశలు జరుపనున్నట్టు ఢిల్లీ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ఈ లోక్సభకు ఇంకా గడువు ఉన్నప్పటికీ ఫొటో సెషన్ నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి? ఇది దేనికి సంకేతం? ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా, డిసెంబర్లోగా జరగాల్సిన 5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఎక్కడా గెలిచే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరి ఎందుకోసం ఈ హడావుడి? లేని రాజకీయ దుమారాన్ని సృష్టించి విపక్ష కూటమి బలపడకుండా చేయడం, గందరగోళం సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నది బీజేపీ వ్యూహమా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 9, 10న జరిగే జీ-20 సమావేశాలకు ముందు ముందస్తు ఎన్నికలు రూఢి అయితే ఈ సమావేశాలలో ప్రధాని మోదీ ఇమేజ్ మీద ప్రతికూల ప్రభావం పడవచ్చు అన్న అంచనాతో అనురాగ్ ఠాకూర్తో ప్రకటన చేయించారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదేది కాదని పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశపరచడంలో మోదీ సర్కార్ ఆంతర్యంపై సందేహాలు కలుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు సమయం సరిపోదనే ఉద్దేశంతోనే ఈ సమావేశాలకు సెప్టెంబర్లో ముహూర్తం పెట్టడానికి బలమైన కారణమే ఉంటుందని వాదన.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేది కీలకమైన బిల్లుల కోసమేనని పాలకపక్షం బీజేపీ చెబుతున్నది నమ్మశక్యంగా లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్, బీసీ సబ్ క్యాటగిరీ, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం కోసం అని అంటున్నారు. అదే నిజమైతే నవంబర్, డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశాలలో కూడా ఆ బిల్లులు పెట్టవచ్చు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి బిల్లు పెట్టడం ద్వారా తేనెతుట్టెను కదిపే సాహసం చేస్తుందా? అనేది కూడా అనుమానమే. అలాగే బీసీ సబ్ క్యాటగిరీ. బీసీ జనగణననే ఇంత వరకు జరుగలేదు. బీసీ సంఘాలు ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్నా దానిని కేంద్రం పట్టించుకోలేదు. బీసీ గణన జరుగకుండా ఇప్పటికిప్పుడు బీసీ సబ్ క్యాటగిరీ బిల్లు ప్రవేశపెడుతుందా? అనేది కూడా అనుమానమే.
బీసీ సబ్ క్యాటగిరీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకునే పక్షంలో మరి తమ సంగతేంటి? అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి డిమాండ్లు వస్తే దానికి ఏం సమాధానం చెప్పగలదు. ఇక మూడోది మహిళా రాజర్వేషన్ బిల్లు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది కాబట్టి లోక్సభలో ఆమోదం పెద్ద కష్టమేమీ కాదు. అక్కడ బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. విపక్షాల కూటమిలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), సమాజ్వాది సహా ఎంపీలలో అనేకమంది మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. తమ వైఖరిని మార్చుకున్నట్టు వారు ఎక్కడా చెప్పలేదు. దీంతో మహిళా బిల్లును ప్రవేశపెట్టి విపక్ష కూటమిలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ ఏమైనా వ్యూహం పన్నుతున్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో అత్యంత ప్రావీణ్యం ఉన్న మోదీ సర్కార్ ప్రత్యేక సమావేశాలను కూడా అందుకు వాడుకుంటుందా? అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్రం కమిటీ వేసినా దానిని సమర్థించే రాజకీయ పార్టీలు ఏవి? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. బీజేపీ రాష్ర్టాలు తప్ప కాంగ్రెస్ దాని మిత్రపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు ఏవీ జమిలి ఎన్నికలను సమర్థించడం లేదు. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీహార్లో జేడీయూ-ఆర్జేడీ, ఢిల్లీ, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో సీపీఎం, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒడిశాలో బిజూ జనతాదళ్ (బీజేడీ) గతంలో జమిలి ఎన్నికలను సమర్థించినప్పటికీ ప్రస్తుతం ఆ పార్టీ అధినేత, సీఎం నవీన్ పట్నాయక్ అనుకూలంగా లేరని సమాచారం. వైఎస్ఆర్సీపీ తాజాగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీలో దక్షిణాదికి స్థానం కల్పించకపోవడం వివాదాస్పదంగా మారింది. ఇం తటి కీలకమైన అంశంలో దక్షిణాదిని ఎలా విస్మరిస్తారని విపక్ష పార్టీలు నిలదీస్తున్నా కేంద్రం సమాధానం చెప్పలేకపోతున్నది. ఇప్పటికే దక్షిణాది రాష్ర్టాల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదన్న ఆరోపణకు ఈ ఉదంతం ఆజ్యం పోసినట్టు అయింది. దక్షిణాదిలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి (కేంద్రపాలిత) రాష్ర్టాలు ఉన్నాయి. తెలంగాణలో 17, ఏపీలో 25, కర్ణాటకలో 28, కేరళలో 20, తమిళనాడులో 39, పాండిచ్చేరిలో ఒకటి మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయి.