Harish Rao | డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు, ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అందుకు ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యమని పేర్కొంటూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పలు వీడియోలను ట్వీట్ చేశారు.
గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100, గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 ఎలిజిబిలిటీని పరిగణించాలని విజ్ఞప్తి చేసిన వారికి, అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. 25 వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ, 11 వేల పోస్టులు మాత్రమే వేసి చేతులుదులుపుకున్నదని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, ఆరు నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం విద్యార్థులను మోసం చేయడమేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామక పత్రాలు అందించి, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప, యువత, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి అని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్స్ విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం.
గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 మరియు గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే… pic.twitter.com/ZSykdBjQaY
— Harish Rao Thanneeru (@BRSHarish) June 14, 2024