MLC Kavita : ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిమాలిన హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. డిగ్రీ చదివిన ఆడబిడ్డలకు స్కూటీలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఇప్పుడా హామీ సంగతి ఏమైందని ఆమె ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వలేదని, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదని ఆమె ఫైరయ్యారు.
అదేవిధంగా మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కారు అమలు చేయలేదని కవిత ఆరోపించారు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు పెన్షన్లను కూడా పెంపు చేయలేదని విమర్శించారు. మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.
విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కవిత మండిపడ్డారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్ పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ జులుం నడుస్తున్నదని, కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పథకాలను ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు.