రంగారెడ్డి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనా విధానమే తమ వ్యాపార విస్తరణకు ఆదర్శమని వెల్స్పన్ చైర్మన్ బాలక్రిషన్ గోయెంకా తెలిపారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్నారని, దీనిని ఆదర్శంగా తీసుకొని తాము ‘హర్ ఘర్ సే.. హర్ దిల్ తక్ వెల్స్పన్’ అనే నినాదంతో వ్యాపార విస్తరణకు పూనుకొన్నామని చెప్పారు. ప్రతి ఇంటికి నల్లా నీరు ఎలా వెళ్తున్నదో.. అలాగే తమ కంపెనీ ఉత్పత్తులను కూడా ఇంటింటికీ తీసుకెళ్లనున్నామని వెల్లడించారు. నేడు పొరుగు దేశాలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయని, సీఎం కేసీఆర్ కలలుగన్న ‘బంగారు తెలంగాణ’ ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ పరిధిలోని చందన్వెల్లిలో రూ. 2,000 కోట్లతో నెలకొల్పిన ‘వెల్స్పన్’ అడ్వాన్స్ మెటీరియల్ కంపెనీ బుధవారం ప్రారంభమైంది. ఇదే ప్రాంతంలో ఐటీ సెంటర్ను కూడా నెలకొల్పుతామని బాలక్రిషన్ గోయెంకా ప్రకటించారు. చందన్వెల్లి ప్రాంతం మరో ఐదేండ్లలో పరిశ్రమల వ్యాలీగా, మరో సిలికాన్ వ్యాలీగా అవతరిస్తుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నదని, పాలకులు, ప్రజలు ఇలాగే మద్దతు కొనసాగిస్తే చందన్వెల్లిలో మరో రూ.3,000 కోట్లు పెట్టుబడి పెడుతామని ప్రకటించారు.
రానున్న ఐదేండ్లలో రంగారెడ్డి జిల్లా చందన్వెల్లి ప్రాంతం పరిశ్రమల స్వర్గధామంగా మారుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. వెల్స్పన్ కంపెనీ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మూడేండ్ల క్రితం ఈ ప్రాంతంలో ఏమీ లేదని, ప్రస్తుతం పరిశ్రమలు పెట్టేందుకు పొరుగు రాష్ర్టాలు, ఇతర దేశాల నుంచి అనేక సంస్థలు వస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తుతో షాబాద్ పరిధిలోని చందన్వెల్లి ప్రాంతం అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా అవతరిస్తుందని తెలిపారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులకు ముగ్ధులై పొరుగు రాష్ర్టాలలో ఏర్పాటు కావాల్సిన కంపెనీలు కూడా ఇక్కడికి తరలి వస్తున్నాయని చెప్పారు. గుజరాత్లో ఏర్పాటు కావాల్సిన ‘వెల్స్పన్’ కంపెనీ తెలంగాణకు రావటమే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి పారిశ్రామికవాడలో వెల్స్పన్ కంపెనీని ప్రారంభిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. చిత్రంలో మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు
భారీ పెట్టుబడులు.. వేల ఉద్యోగావకాశాలు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి చందన్వెల్లికి నాలుగు లైన్ల రహదారి మంజూరైనట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ.100 కోట్ల టీఎస్ఐఐసీ నిధులతో ఈ రహదారిని నిర్మించనున్నట్టు చెప్పారు. వెల్స్పన్ కంపెనీకి స్థానికులు, ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని కోరారు. భారీ కంపెనీల స్థాపనతో ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మహిళలు, యువతకు వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. త్వరలోనే చందన్వెల్లి ‘వెల్స్పన్’ వ్యాలీ అయ్యే అవకాశాలున్నాయని అన్నారు. వ్యవసాయంలోనూ అద్భుతంగా రాణిస్తున్న ఈ ప్రాంతానికి త్వరలోనే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీటిని తీసుకొస్తామని తెలిపారు. షాబాద్, చందన్వెల్లి, సీతారాంపూర్ ప్రాంతంలో పారిశ్రామికంగా వేగంగా మార్పులు వస్తున్నాయని, త్వరలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వెల్స్పన్ అధినేత బాలక్రిషన్ తెలంగాణకు అతిపెద్ద అంబాసిడర్గా మారనున్నారని తెలిపారు. కార్యక్రమంలో వెల్స్పన్ చైర్మన్ బాలక్రిషన్ గోయెంకా, దీపాలి గోయెంకా, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్రెడ్డి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు, కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
చందన్వెల్లిలో వెల్స్పన్ ఐటీ సెంటర్
చందన్వెల్లిలో ఐటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్స్పన్ చైర్మన్ బాలక్రిషన్ గోయెంకా బుధవారం ప్రకటించారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న విభాగాలకు అదనంగా ఐటీ, ఐటీఈఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కేంద్రంలో యువతకు ఐటీ రంగంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో తమకు అహ్మదాబాద్, ముంబైలో సెంటర్లు ఉన్నాయని, తాజాగా చందనవెల్లిలో మరో సెంటర్ను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా బాలక్రిషన్కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఐటీ విస్తరించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్స్పన్ నిర్ణయం బలోపేతం చేస్తుందని అన్నారు. స్థానిక యువకులు ఐటీ ఉద్యోగాలు చేసుకొనేందుకు ఈ సెంటర్తో అవకాశం లభిస్తున్నదని పేర్కొన్నారు. వెల్స్పన్ ఐటీ సెంటర్లో వెయ్యి నుంచి 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.