Minister Gangula | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించనున్న ‘వీకెండ్ మస్తి’ సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లను మంత్రి సోమవారం పరిశీలించారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేయర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇతర అధికారులతో కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షించారు. కేబుల్ వంతెనపై శని, ఆదివారాల్లో వీకెండ్ మస్తి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కేబుల్ వంతెన ప్రారంభోత్సవం రోజున నిర్వహించిన కార్యక్రమాలను మరిపించేలా.. ప్రజలకు ఆనందంతో పాటు ఉత్సాహాన్ని కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫుడ్ స్టాళ్లు ఇతర ఏర్పాట్లు జరగాలని సూచించారు. అదేవిధంగా పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. స్టాళ్లను ఏర్పాటు చేసిన చోట, ఇతర ప్రాంతాల్లో చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని, ఫుడ్ స్టాల్స్ ఖచ్చితమైన నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడాలన్నారు. స్టాల్స్ ఏర్పాటుకు ఎలాంటి ఫీజును వసూలు చేయొద్దన్నారు. ఎలాంటి ఫీజు వసూలు చేయరాదని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మేయర్ వై సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సూడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఉన్నారు.