హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కొత్త తరం ఇంటర్నెట్ టెక్నాలజీగా పిలుస్తున్న వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్ బాక్స్ను తెలంగాణ ఐటీ శాఖ ఆవిష్కరించింది. ఆదివారం బెంగళూరులో ఎథ్ ఇండియా హ్యాకథాన్-2022 ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి దీన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. దేశీయ కంపెనీలు, స్టార్టప్లను సమర్థంగా ముందుకు నడిపేందుకు దోహదపడేలా తెలంగాణ ప్రభుత్వం వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్ బాక్స్ను ప్రారంభించిందన్నారు. ఈ శాండ్ బాక్స్తో చేతులు కలిపేందుకు కొన్ని జాతీయ నియంత్రణ సంస్థలు సైతం ముందుకొచ్చినట్టు తెలిపారు. ఇంటర్నెట్ వాడకంలో వెబ్ 3.0 అత్యాధునికమైనదని, ఆవిష్కర్తలు తమ ఉత్పత్తులను పరీక్షించుకోవడంతోపాటు సంబంధిత నియంత్రణ సంస్థల అధికారులతో ధ్రువీకరింపజేసుకొనేందుకు ఈ ప్లాట్ఫామ్ ఎంతో దోహదపడుతుందని రమాదేవి పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలో వెబ్ 3.0 ఎకో సిస్టంను మెరుగుపరుస్తుందని చెప్పారు. ఎథ్ ఇండియా హ్యాకథాన్లో 30 దేశాలకు చెందిన 2 వేల మందికిపైగా టెక్ నిపుణులు పాల్గొని 459 ప్రాజెక్టులను రూపొందించినట్టు తెలిపారు.