రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం ఓ నేతన్నను బలితీసుకున్నది. ఆర్డర్లు, పెండింగ్ బకాయిలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నా రాష్ట్ర సర్కారు కనికరించకపోవడంతో ఓ నేత కార్మికుడి ప్రాణం గాల్లో కలిసింది. సాంచాలు నడవక, ఉపాధి కోల్పోయి కనీసం తనకు, తన భార్య మందుల కొనుగోలుకు చిల్లిగవ్వ లేక, కుటుంబ పోషణ భారమై తీవ్ర మనస్తాపానికి గురై ఓ నేతన్న శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నూలు దారాన్నే ఉరితాడుగా పేనుకుని ఉరేసుకొని తనువు చాలించిన ఘటన కార్మిక క్షేత్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్నగర్కు చెందిన మరమగ్గాల కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ (62)కు భార్య, ఇద్దరు కుమారులు.
ఉమ్మడి రాష్ట్రంలో కుటుంబాన్ని వదిలి ఉపాధి కోసం భీవండి వెళ్లాడు. అక్కడ పొట్టకు తింటూ సాంచాల పని చేశాడు. అప్పుడు సాంచాలు నడిపిస్తుండగా, జోట ఎగిరి వచ్చి కుడికాలు మోకాలికింద గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణ వైద్యం చేయించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పని కల్పించడంతో తొమ్మిదేండ్ల కింద సిరిసిల్లకు తిరిగి వచ్చాడు.
కాలికి తగిలిన గాయం పుండుగా మారింది. అయినా కుటుంబ పోషణ కోసం సాంచాలు నడిపిస్తున్నాడు. లక్ష్మీనారాయణ తన పెద్ద కుమారుడు నవీన్కు పెండ్లి చేశాడు. నవీన్ టెక్స్టైల్స్ పార్కులో సాంచాల పనిచేస్తుండగా, చిన్న కొడుకు వేణు హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేండ్ల కింద తల్లి వజ్రమ్మకు పక్షవాతం వచ్చి ఎడమ కాలు, ఎడమ చెయ్యి పడిపోయి మంచాన పడింది. మూడు నెలల కిత్రం తల్లి సేవ కోసం వచ్చిన వేణు ఉద్యోగం వదిలి ఇక్కడే ఉంటున్నాడు.
మందులకు రూ.4 వేలు లేక..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల కార్మికులకు వస్త్ర ఆర్డర్లు ఇవ్వకపోవడం, యజమానులకు రావాల్సిన బకాయిలు 290 కోట్లు విడుదల చేయకపోవడంతో మూణ్ణెళ్లుగా సాంచాలు బంద్ పడ్డాయి. లక్ష్మీనారాయణ ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. తనకు, తన భార్యకు మందుల కోసం నెలకు రూ.4 వేలు ఖర్చు చేయలేక గోసపడ్డాడు. కుటుంబ పోషణకు కూడా తిప్పలు పడ్డాడు. పెద్దకొడుకు నవీన్ కూడా ఉపాధి కోల్పోయి ప్రత్యామ్నాయంగా చిన్న హోటల్ పెట్టుకున్నాడు. కానీ, అది సరిగా నడవలేదు.
నవీన్ కొడుకు మనీశ్ (5) ఆరోగ్యం బాగా లేక వైద్యానికి రూ.3 లక్షల అప్పు చేశాడు. చిన్న కొడుకు వేణు ఉద్యోగ వేటలో ఉన్నా ప్రయత్నాలు ఫలించడం లేదు. సిరిసిల్లలో పదేండ్ల కిందటి సంక్షోభం పునరావృతం కావడం, ఉపాధి దెబ్బతినడంతో లక్ష్మీనారాయణ తీవ్ర మనస్తాపం చెందాడు. కుటుంబాన్ని పోషించలేక, భార్యకు మందులు కొనడానికి డబ్బులు లేక శనివారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.