హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో మధ్యయుగాల నాటి పరిస్థితి వస్తుందని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీకి వ్యతిరేకంగా భవిష్యత్తులోనూ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, గాదరి కిశోర్, ఎమ్మెల్సీ రవీందర్రావుతో హైదరాబాద్లోని ఎంబీ భవన్కు వెళ్లి సీపీఎం నేతలను, మగ్ధూం భవన్లో సీపీఐ నాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా కార్యాలయాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జీ నాగయ్య, బీ వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు, మల్లు లక్ష్మి, ఎండీ అబ్బాస్, టీ సాగర్, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పార్టీ నేతలు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, ఈటీ నర్సింహ, ఉజ్జిని యాదగిరిరావుతో విడివిడిగా సమావేశమయ్యారు.
వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పలు అంశాలపై లెఫ్ట్ నేతలతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని నిలువరించే శక్తి టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు ఉన్నందునే సీపీఐ, సీపీఎం మద్దతిచ్చాయన్నారు. మునుగోడులో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కసితో మతోన్మాద శక్తులను ఓడించేందుకు కృషి చేశారని ప్రశంసించారు. ఈ ఐక్యత ఇక ముందూ కొనసాగాలని ఆకాంక్షించారు. మోదీ ప్రభుత్వం తిరోగమన విధానాలను అవలంబిస్తున్నదని దుయ్యబట్టారు. మునుగోడు ఫలితం బీజేపీకి చెంపపెట్టులాంటిదని, ఆ పార్టీ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. వామపక్ష పార్టీలు, నాయకులు చారిత్రక బాధ్యతను నెరవేర్చారని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకొచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి నిరోధక శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తామని, బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సజావుగా సాగుతున్న పరిపాలనకు ఆటంకాలను సృష్టించి, అభివృద్ధిని అడ్డుకొనేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రతోనే మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని జగదీశ్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడిని సృష్టించే యత్నం చేసిందని విమర్శించారు. సొంత అభ్యర్థి కోసం కష్టపడినట్టే రాష్ట్ర కార్యదర్శి నుంచి గ్రామ కార్యదర్శి వరకు సీపీఐ, సీపీఎం నేతలంతా పూర్తిస్థాయిలో నిమగ్నమై పనిచేశారని, కమ్యూనిస్టుల మద్దతుతోనే టీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. బీజేపీ ఎన్ని కుట్రలు, అక్రమాలు చేసినా.. ప్రజలు ఏకపక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని అన్నారు. టీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావుతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. సీపీఎం, సీపీఐ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.
బీజేపీకి తెలంగాణలో ముగింపు కార్డు వేశాం: కూనంనేని
మునుగోడు ఎన్నిక ద్వారా బీజేపీకి తెలంగాణలో ముగింపు కార్డు వేశామని కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ వాసనే లేదని ఎద్దేవా చేశారు. రాజగోపాల్రెడ్డి లాంటి వ్యక్తులు ఒకరిద్దరు దొరికితే ఆ పార్టీకి వారే ఆధారంగా ఉండేవారని, కానీ ఆ వికెట్లు పడిపోయాయని తెలిపారు. కమ్యూనిస్టు నాయకులు లేవనెత్తిన ప్రజా సమస్యలను పరిషరిస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆర్టీసీ సమస్యల పరిషారాన్ని మంత్రులు ఒక దశకు తీసుకొచ్చారని, మరో ఒకటిరెండు సమస్యలు ఉన్నాయని తెలిపారు. టీఆర్ఎస్, సీపీఐ అన్నదమ్ముల్లాగా కలిసి పని చేయడంతోనే మునుగోడు ఎమ్మెల్యేగా ప్రభాకర్రెడ్డి గెలిచారని పేర్కొన్నారు. అంతకుముందు ప్రభుత్వ విప్ బాలసుమన్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా సీపీఐ నేతలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మోదీకి నిరసన తెలుపుతాం
8 ఏండ్లలో అనేక కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ప్రధాని మోదీ కార్మిక వ్యతిరేకిగా ముద్ర వేసుకొన్నారు. ఎల్ఐసీ నుంచి బొగ్గు గనుల వరకు ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ కార్మికులను బజారు పాల్జేస్తున్నారు. సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మార్చిన మోదీకి వ్యతిరేకంగా కార్మికలోకం నిరసనకు దిగనున్నది.
-కెంగర్ల మల్లయ్య,టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
రోజుకో రీతిలో నిరసన
స్వదేశీ నినాదం చేసే మోదీ.. కార్పొరేట్ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం దారుణం. సింగరేణిలో 4 బ్లాక్ల వేలం ప్రయత్నాలను కార్మికులు అడ్డుకొంటుంటే, కేంద్రం ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చర్యలు తీసుకొన్నది. మోదీ గోబ్యాక్ నినాదంతో రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తాం.
-రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి
తడాఖా చూపిస్తాం
అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2014లో ప్రధాని అయి న మోదీ మా ట తప్పారు. ఎస్సీ వర్గీకరణ హామీ నిలబెట్టుకోని మోదీకి తెలంగాణలో కాలుపెట్టే అర్హత లేదు. ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్, ఆనాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటివరకు పట్టించుకోలేదు.
-పిడమర్తి రవి,ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్