హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని మేల్కొల్పుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఎవరికీ నమ్మకంలేని సమయంలో ఒంటరిగా పోరాటం మొదలుపెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని, ఇప్పుడు బీజేపీని గద్దె దించేందుకు అదే పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
నాడు ఎవరూ నమ్మలేదు
ఆశలు ఉడిగిపోయి.. నిస్సహాయ స్థితిలో కూరుకుపోయి.. ఇదెక్కడి తెలంగాణ, ఇదెలా సాధ్యం.. అని మొత్తం సమాజమే నిద్రాణమైన వేళ వెనకడుగు వేయకుండా ముందుకెళ్లినం. నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చేముందు నా మిత్రుడు మధుసూదనాచారి కలిసి పనిచేసినం. ఎనిమిది, తొమ్మిది నెలలు నెత్తి పగలగొట్టుకున్నం. ఇవాళ దేశం కోసం కొట్లాడుతున్నట్టే చాలామంది నాయకులతో మాట్లాడినం. 30 నుంచి 40 సమావేశాలు పెట్టినం. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పిలిచినం. ఎవరూ రాలేదు. అంతతా నిస్సహాయ పరిస్థితి ఉండేది. కానీ మేం నిరుత్సాహ పడలేదు. మేం ఎంచుకున్న పంథా ప్రజలను జాగృతం చేయడం. మాస్ని నిద్రలేపడం. ఇద్దరు, ముగ్గురు నాయకులను పట్టుకొచ్చి ఒక్కడికి చెప్పడం కాదు. ప్రజలంతా కలిసి రావాలని తలిచినం. అందుకే మాస్ని లేపినం. అప్పుడే నేనొక పాట రాసిన. కొంతమంది, పిడికెడంత మంది నిరాశ పడినంత మాత్రాన ప్రజలు నిరుత్సాహ పడొద్దని చెప్పిన. ఫెయిల్యూర్స్ని చూసి భయపడొద్దని చెప్పిన.
సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని/ అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్య్రం/ రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది/ ముమ్మాటికీ తెలంగాణ వచ్చి తీరుతుంది.. అని పాట ఉంటుంది. అదే స్ఫూర్తితో ప్రజలను జాగృతం చేసినం. తెలంగాణ ప్రజలను లేపినం. అనేక ఉద్యమాలు చేసినం. అందులో అనేకానేక కార్యక్రమాల్లో తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా (జర్నలిస్టులు) దోహదపడ్డారు. దేశంలో నాలుగు పార్టీలు, ముగ్గురు వ్యక్తులను ఏకం చేయాలని మేం అనుకోవడం లేదు. జనంలోనుంచే మార్పు తీసుకొద్దామని అనుకుంటున్నాం. ఓ ప్రబలమైన, పవిత్రమైన, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేలా ఓ శక్తిని ఏకం చెయ్యాలని భావిస్తున్నా. దానికోసమే ఇప్పుడు రచన చేస్తున్నాను. నేను ఏదైనా ఎత్తుకుంటే ఎంత సీరియస్గా ఉంటదో దేశానికి ఇప్పటికే తెలుసు. ప్రస్తుతం.. ఆ పనిలోనే ఉన్న. అది వందశాతం చేస్తాం. దేశ ప్రజలు జాగృతమైతే ఆటోమేటిక్గా మిగతా నాయకులంతా మోకాళ్ల మీద ఉరికి వస్తరు. టీఆర్ఎస్ని ఎగతాళి చేసి, ఎన్నో మాటలన్న బీజేపీతోని జై తెలంగాణ అనిపించలేదా? కాంగ్రెస్, చంద్రబాబు, సీపీఐతో జై తెలంగాణ అనిపించలేదా? అదే ఇప్పుడు దేశంలోనూ జరుగుతది. తప్పకుండా ప్రబలమైన, విప్లవాత్మక ప్రత్యామ్నాయ ఎజెండాను దేశం ముందుకు తీసుకొస్తాం.
కేసీఆర్ డేర్ డెవిల్ ఫెలో
కేసీఆర్ డేర్ డెవిల్ ఫెలో. పట్టుబడితే సాధించి తీరుతడు. జైళ్లకు, కేసులకు భయపడితే నేను తెలంగాణ ఉద్యమం చేసేవాడినా? న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయం ఇంకా బతికే ఉన్నది. కొట్లాడతం.. కేసీఆర్ ఈజ్ ఏ ఫైటర్. ఈ వయసులో నేనెందుకు భయపడత? అది బీజేపీకి తెలుసు. అందుకే.. వాళ్ల ప్రయత్నం ఏంటో తెలుసా? కేసీఆర్ను తెలంగాణలోనే బిజీ చెయ్యాలట. ఏక్నాథ్ షిండేను తీసుకొచ్చి ఇక్కడ దించితివనుకో.. బిడ్డా నేను ఫ్రీ అయిపోత.. నాకు కొట్లాడుడు అలవాటు. ఫ్రీగా ఉంట కాబట్టి.. దుమ్ము రేగ్గొట్టేటట్టు కొట్లాడొచ్చు కదా? అయినా మేం ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళతాం. బీజేపీలా అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చేబుద్ధి మాకు లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పినం. కొత్త ప్రాజెక్టులు రావాలని, కొత్త పథకాలు కావాలని దేశంలో ఎవరికి లేదు చెప్పండి? దేశానికి ఇవన్నీ అవసరం లేదా? దేశంలో ఏ రాష్ట్రంలో కోరుకోరు నా ఎకరంలో నీళ్లు రావాలని? ఈ దేశంలో ఎవరు కోరుకోరు నేను సంతోషంగా ఉండాలని చెప్పండి? ఇదే నా ఎజెండా.. ఆ ఎజెండాతోనే ప్రజలను జాగృతం చేస్తూ.. ముందుకెళతాం.