Harish Rao | గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ చర్చ సందర్భంగా ఇవి కూడా చర్చకు వచ్చాయని అన్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన లేఖలను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో శనివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
వరద జలాలు అంటున్నాడని.. లెక్క తేలకుండా వాటిని ఎలా తీసుకెళ్తావని చంద్రబాబుపై హరీశ్రావు మండిపడ్డారు. నీళ్లు నిండుగా ఉంటే గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించావని చంద్రబాబును హరీశ్రావు నిలదీశారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీలోనే కేటాయించిన నీళ్లనే అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. కచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ 2020లోనే కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు లేఖ రాశారని.. సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల గోదావరి జలాల్లో తెలంగాణకు 1950 టీఎంసీలు కేటాయించాలని కోరారని హరీశ్రావు తెలిపారు. హైదరాబాద్ నీటి అవసరాలు, పరిశ్రమల కోసం వాటిని వినియోగించుంటామని లేఖలో పేర్కొన్నారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు
టీఎంసీలు అడుగుతున్నాడు కానీ.. 400 టీఎంసీలు వినియోగించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ లెక్క తేలకుండా బనకచర్ల ప్రాజెక్టు ఎట్లా కడుతావని రేవంత్ రెడ్డి అడుగాలి కదా అని ఆయన ప్రశ్నించారు.
గోదావరి నీళ్లు లెక్క తేలకుండా, వాటా తేలకుండా రాత్రికి రాత్రి ప్రాజెక్టు కడితే తెలంగాణ ఊరుకోదని హరీశ్రావు స్పష్టం చేశారు. దీనికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నా తెలంగాణ సమాజం ఒప్పుకోదని అన్నారు. నీళ్ల కోసం మరోసారి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందని.. మరోసారి యూనివర్సిటీలు ఉద్యమ వేదికలు అవుతాయని హెచ్చరించారు. బనకచర్ల ప్రాజెక్టు కోసం రేవంత్ రెడ్డి సంతకాలు పెడితే కేసీఆర్ ఊరుకోడు.. రైతులు ఊరుకోరని అన్నారు. సుప్రీంకోర్టుకైనా వెళ్తాం.. రోడ్లను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వాటాలో చుక్క నీటిని వదలుకోమని స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని హరీశ్రావు అన్నారు. పోలవరం ప్రాజెక్టును కట్టి కృష్ణా పరివాహక ప్రాంతానికి నీటిని తీసుకెళ్తామని చెప్పారని తెలిపారు. 1980లో బచావత్ ట్రిబ్యునల్ 80 టీఎంసీలను కృష్ణా నదికి తరలిస్తే, నాగార్జునసాగర్ మీద ఉన్న 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని చెప్పారని అన్నారు. ఆ 45 టీఎంసీలు మాకు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. 80 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకెళ్తే ప్లోరాట ప్రకారం నీళ్లు కేటాయించాలన్నారు. 157 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తేనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని స్పష్టం చేశారు. 157 టీఎంసీలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఎందుకు అడుగడని ఆయన ప్రశ్నించారు.