వికారాబాద్ : రాష్ట్రంలో త్వరలో 750 డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లాలో పలు సర్కారు దవాఖానలను శ్రీనివాస్ రావు సందర్శించారు. అనంతరం జిల్లాలోని వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పీహెచ్ సీలలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందులో భాగంగా వైద్యులకు శిక్షణ ఇస్తామన్నారు.
ఇకమీదట డిప్యూటీ డీహెచ్ఎంవోలు, ప్రోగ్రాం ఆఫీసర్ల వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి పీహెచ్సీలో 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. సర్కారు దవాఖానలో సాధారణ ప్రసవం చేస్తే రూ.3,000 అందజేస్తామని వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి తుకారాం భట్, అధికారులు పాల్గొన్నారు.