హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కోట్లాది మందికి జీవిత బీమా సేవలందిస్తున్న ఎల్ఐసీని పోరాటాలు చేసి రక్షించుకొంటామని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వీ రమేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల ఎల్ఐసీ ఉద్యోగుల 21వ జాతీయ మహాసభ ముగింపు కార్యక్రమం ఆదివారం దోమలగూడలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ చేస్తూ కేంద్రం ప్రైవేటీకరించేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. ఉద్యోగులు, ఏజెంట్లు ఐక్యంగా పోరాటాలు చేసి కేంద్రం చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బీఎస్ రవి, సుజాత, టీవీఎన్ఎస్ రవీంద్రనాథ్, ఎన్ ఆదిశ్రెడ్డి, శ్రీనివాసులు, జీ తిరుపతయ్య, డీఎస్ రఘు, ఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.