హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీఎస్టీ పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీసీ సంఘం నేతలకు కేంద్రం నుంచి వింత సమాధానం ఎదురైంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు వెళ్లి, అన్ని రాష్ర్టాలను ఒప్పిస్తే జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తామని కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి యూపీ సింగ్ పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ శుక్రవారం ఢిల్లీలో యూపీ సింగ్ను కలిసి, జీఎస్టీ పెంపుదల వల్ల చేనేత రంగానికి జరిగే నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా యూపీ సింగ్ మాట్లాడుతూ.. కేంద్రం చేతుల్లో ఏమీ లేదని, వివిధ రాష్ర్టాల ఒత్తిడి కారణంగానే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెంపుదల నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. అన్ని రాష్ర్టాలు పన్ను మినహాయింపునకు సిద్ధపడితే జీఎస్టీని సమూలంగా రద్దు చేసే అవకాశం ఉన్నదని వివరించారు. నిజానికి వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని తెలంగాణతో పాటు వివిధ రాష్ర్టాలు వ్యతిరేకించాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలే స్వాగతించాయి. దీంతో కేంద్ర కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.