హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ) : ‘ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం.. రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తాం’ అని హామీలు గుప్పించి నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే వారిపై ఉక్కుపాదం మోపుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు కేటీఆర్ను కలిశారు. రాష్ట్రంలో 20 వేల పోలీస్ పోస్టులు ఖాళీగా ఉంటే.. కేవలం 5 వేలు మాత్రమే భర్తీచేయాలని నిర్ణయించి అన్యాయం చేస్తున్నదని గోడు వెళ్లబోసుకున్నారు. రెండేండ్లుగా కోచింగ్ తీసుకుంటున్నామని ఏకరువుపెట్టారు. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తిచేశారు. ఒక్కసారి దిల్సుఖ్నగర్ రావాలని కోరారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం మాట్లాడుతూ.. నిరుద్యోగుల నిరసనలతో అశోక్నగర్, దిల్సుఖ్నగర్ రగిలిపోతుందని తెలిపారు. ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణచివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రెండున్నరేండ్లుగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నామని స్పష్టంచేశారు.
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 95 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించిన ఘనత కేసీఆర్దేనని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన 65 వేల ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకొనే నీచానికి ఈ ముఖ్యమంత్రి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు వెంటనే 20 వేల పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగార్థులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.