Sridhar Babu | పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. కోచింగ్ సెంటర్లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అభ్యర్థుల భద్రత, ఫీజుల భారంపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని తెలిపారు. విద్యారంగ సంస్కరణలపై బుధవారం సచివాలయంలో అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై ఉన్నతాధికారులకు ఆయన మార్గదర్శకం చేశారు. సమావేశంలో సబ్ కమిటీ సభ్యురాలు పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమశాఖల మంత్రి ధనసరి అనసూయ పాల్గొన్నారు.
ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని శ్రీధర్ బాబు తెలిపారు. కోచింగ్ సెంటర్ల నియంత్రణపై కేంద్రం గైడ్లైన్స్ని అమలు చేసి వీటిని కట్టడి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల నిర్దారణపై నియంత్రణ కమిటీ ఏర్పాటే చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు శ్రీధర్బాబు వెల్లడించారు. ప్రభుత్వ స్కూల్స్ను ప్రతిభా కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే పేద విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి పేర్కొన్నారు. అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ను వేర్వేరుగా నడపడంతో మానవ వనరుల వృథా జరుగుతోందని రెండింటిని విలీనం చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని ఆదేశించారు.
విద్యార్థులు లేని 1,600 పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూల్స్ను బదిలీ చేయాలని సూచించారు. డిగ్రీ కళాశాలల్లో బీఏ కోర్సుల పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసి విద్యార్థులను ఉద్యోగాలకు సంసిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసే పనులను వేగవంతం చేయాలని చెప్పారు. మాసబ్ ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, కొత్తగూడెం, సికింద్రాబాద్, కులీకుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. విద్యాప్రమాణాల్లో రాష్ట్రం 34వ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రెండేళ్లలో ఈ దుస్థితి నుంచి బయటపడాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రైవేట్ స్కూల్స్ని ఈ దిశలో ముందడుగు వేసేలా చూడాలని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లోని పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఏడాది పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వద్ద ఇంటర్నీలుగా పనిచేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. దాంతో వారికి ప్రభుత్వ పాలనపై అవగాహన కలుగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో కృత్రిమ మేథను వినియోగించాలని కోరారు. పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చదివే విద్యార్థులకు పరిశ్రమల్లో ఆన్ హ్యాండ్ శిక్షణనిస్తే వారికి వెంటనే ఉద్యోగాలు దొరుకుతాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సృజనను బయటకు తెచ్చేలా ప్రతి కళాశాల డిజిటల్ మ్యాగజైన్లను నడపాలని సూచించారు. బీకాం, బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు బీఎఫ్ఐసీ సంస్థల్లో శిక్షణ ఇప్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీల్లో బయో సైన్సెస్, ఫార్మా కోర్సులను వచ్చే ఏడాది నుంచే ప్రవేశ పెట్టేలా పాఠ్యాంశాలు రూపొందించాలని ఆదేశించారు.