మహబూబ్నగర్ : డబుల్ బెడ్ రూం ఇండ్ల అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దందా చేసిన అక్రమార్కులను అదుపులోకి తీసుకున్న పోలీసులను ఆయన అభినందించారు.
పేద ప్రజలెవరు దళారుల బారిన పడి మోసపోవద్దని మంత్రి కోరారు. డబ్బులతో డబుల్ బెడ్ రూం ఇండ్లు వస్తుందని భావిస్తే అది ముమ్మాటికి ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ ద్వారా మాత్రమే వస్తున్నదేనని అర్థం చేసుకోవాలని, అది ముమ్మాటికి తప్పుడు మార్గమేనని గుర్తించాలని ఆయన సూచించారు.
ప్రభుత్వం నిజాయితీగా పేదలకే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తుందని తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇండ్ల ఆశతో ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోయి ఉంటే కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
పేదల ప్రజలను మోసం చేసే వారు ఎంతటి వారైనా శిక్షతప్పదన్నారు. ఇలాంటి వారి పట్ల అధికారులు సైతం నిఘా వేయాలని ఆదేశించారు. పేద ప్రజలకు నిజాయతీగా ప్రభుత్వ పథకాలు అందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మరోవైపు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో టేపుల అంశంతో పాటు డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించి సత్వరమే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్ ను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.