హైదరాబాద్ : పీ.ఎస్.యు.ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ( P.S.U ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ ఈనెల 28, 29 వ తేదీల్లో నిర్వహించనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీ.ఆర్.ఎస్.కే.వీ కార్మిక విభాగం సంపూర్ణంగా మద్దతు ఇవ్వనున్నట్లు వినోద్ కుమార్ వెల్లడించారు.
ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్ లో సార్వత్రిక సమ్మె విజయవంతానికి అన్ని ట్రేడ్ యూనియన్స్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో ఐ.ఎన్.టీ.యు.సీ., ఏ.ఐ.టీ.యు.సీ., సీ.ఐ.టీ.యు., హెచ్.ఎం.ఎస్, టీ.ఆర్.ఎస్.కే.వీ., ఐ.ఎఫ్.టీ.యు., టీ.ఎన్.టీ.యు.సీ, ఏ.ఐ.యు.టీ.యు.సి, రైల్వే, బ్యాంక్, బీ.డీ.ఎల్. హెచ్.ఏ.ఎల్, బీ.హెచ్.ఇ.ఎల్., పోస్టల్, బీ.ఎస్.ఎన్.ఎల్, ఎయిర్ పోర్ట్స్ ట్రేడ్ యూనియన్స్ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. లాభాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్ర పూరితంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంటోందని అన్నారు. పీ.ఎస్.యు.ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని వినోద్ కుమార్ పేర్కొన్నారు. పీ.ఎస్.యు.ల ప్రైవేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
లాభాలతో నడుస్తున్న రైల్వే, బ్యాంకు,ఎల్.ఐ.సీ, పెట్రోలియం సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు ఎంత మాత్రం సరికాదని వినోద్ కుమార్ అన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో ఎల్.ఐ.సి. కి పోటీగా ఎన్నో ప్రైవేటు సంస్థలు మార్కెట్ లో వచ్చినా నిలువలేదని, అలాగే పెట్రోలియం సంస్థలు బీ.పీ.సీ.ఎల్, హెచ్.పీ.సి.ఎల్, ఐ.ఓ.సి. లకు పోటీగా అనేక ప్రైవేటు సంస్థలూ మార్కెట్ లో వచ్చినా అవి కూడా నిలువలేక పోయాయని అన్నారు.
కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఆచరణలో నిరూపణ అయ్యాయన్నారు. ట్రేడ్ యూనియన్స్ తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వినోద్ కుమార్ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో టీ.ఆర్.ఎస్.కే.వీ. రాష్ట్ర అధ్యక్షులు జీ. రాంబాబు యాదవ్, పీ.ఎస్.యు. కార్మిక సంఘాల రాష్ట్ర కన్వీనర్ వీ. దానకర్ణా చారి, రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎల్. రూప్ సింగ్, వివిధ కార్మిక సంఘాల నాయకులు సంపత్ రావు, వెంకటేష్, రియాజ్ అహ్మద్, బోస్, యాదవ రెడ్డి, రామ్ రాజ్, రామమూర్తి, సౌందరరాజన్, మానయ్య, రాఘవ రావు, భాస్కర్ రెడ్డి, జీవన్ కుమార్, సత్యనారాయణ, తిరుపతయ్య, బాపు రావు, తదితరులు పాల్గొన్నారు.