పెబ్బేరు/ఖిల్లాఘణపురం, అక్టోబర్ 10 : దేశంలోనే మాడల్ జిల్లాగా వనపర్తిని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి సమీపంలోని చింతలకుంట ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పూజలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు.
వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని కార్యకర్తల మధ్య కూర్చొని మంత్రి వీక్షించారు. అనంతరం ఆలయ ఆవరణలో బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో మహాయజ్ఞంలా ఇప్పటికే అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే.. ఎన్నికల్లో విజయం సాధించడం సులభమన్నారు. నియోజకవర్గంలో 70 వేల సభ్యత్వాలు బీఆర్ఎస్కు ఉన్నాయని తెలిపారు.
ప్రతి ఇంటికి ఏదో రూపంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి రూపంలో ఇప్పటికే లబ్ధి చేకూరిందని తెలిపారు. అలాగే ఖిల్లాఘణపురం మండలం గట్టుకాడిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రానున్న ఎన్నికల్లో వెంకన్న కృపతో రాష్ట్ర, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మరోసారి రాష్ట్రంలో, వనపర్తి కోటపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.