రాజన్న సిరిసిల్ల : తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రథమ లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పెద్ద ప్రాజెక్టులు చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేశామని, వాటి ఫలాలను అనుభవిస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో 70 ఏండ్ల కాలంలో చిన్నపాటి వర్షం వస్తే చెరువులు, కుంటలు తెగిపోయేవని, ఇంత భారీ వర్షాలు వచ్చినా ఒక్క చెరువు తెగలేదని అది మిషన్ కాకతీయ ఫలితమేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలు, మిషన్ కాకతీయ వంటి పథకాలతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ప్రభుత్వంపై అదిలాబాద్ నుంచి గద్వాల దాకా భద్రాద్రి నుంచి నారాయణపేట దాకా ఒకే విధమైన పాజిటివ్ స్పందన ఉందన్నారు. మిషన్ కాకతీయ వల్ల దేశంలో ఎక్కడా లేని విధంగా భూగర్భజలాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వ భూగర్భ జల శాఖ నివేదిక చెబుతున్నదన్నారు.
యావత్ తెలంగాణలో భూమిపై, భూగర్భంలో జలాలు నిల్వ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. కరువొచ్చినా రెండేండ్లు బతికేలా నీళ్ల నిల్వకు కృషి చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అభివృద్ధిపై మన వారందరూ పది మంది కలిసి తినేచోట, హోటల్లో పదిమంది కూర్చున్న చోట చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్దే గెలుపని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఎంపీపీ పిల్లి రేణుక, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, అక్కరాజు శ్రీనివాస్, నాయకులు బండారి బాల్రెడ్డి, నమిలికొండ శ్రీనివాస్, సీత్యానాయక్ ఉన్నారు.