నిర్మల్ : రాష్ట్రంలోనే నిర్మల్ పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గుల్జార్ మార్కెట్ మీదుగా పోస్ట్ ఆఫీస్ వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్ పనులను ఆయన పరిశిలించారు.
పోస్ట్ ఆఫీస్ నుంచిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ఆయన పాదయాత్ర చేస్తూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. దవాఖానలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.
దేవరకోట ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సందర్శించారు.
భోజన శాలకు రూ.50 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నిషాన్ వద్ద దర్గాకు ప్రహరీ గోడ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు రోడ్డు వెడల్పు పనులను పూర్తి చేసామని తెలిపారు.
రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టడంతో ప్రజలకు సౌకర్యవంతంగా మారిందన్నారు. రోడ్డు వెడల్పు పనులకు పట్టణ ప్రజలు సహకరించాలన్నారు. అనంతరం శివాజీ నగర్ లో నిర్మిస్తున్న మాడ్రన్ వైకుంఠ ధామం పనులను పరిశీలించారు.
కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, దేవరకోట చైర్మన్ లింగం పల్లి లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.