హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేని విధంగా నిరుపేద ఆడబిడ్డల పెండ్లిండ్లకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. లక్షా1116 ఆర్థిక సహాయం అందజేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శాసనసభ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. లగ్నపత్రిక పెట్టుకున్న రోజే కల్యాణలక్ష్మి కి దరఖాస్తు చేసుకుంటే పెళ్లి రోజే కల్యాణ మండపంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
అనేక మంది పెళ్లి అయిన తరువాత దరఖాస్తులు చేసుకోవడం వల్ల వాటిని 15 రోజుల్లో పరిశీలించిన పిదప అర్హులకు అందజేస్తున్నామని వెల్లడించారు. ఎక్కడా కూడా ఆర్థిక సహాయం అందజేతలో జాప్యం జరగడం లేదని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 50 వేల రూపాయల ఆదాయం. పట్టణాల్లో రూ. రెండు లక్షల ఆదాయం ఉన్న వారికి మాత్రమే కల్యాణలక్ష్మిని ఇస్తున్నామని వెల్లడించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని అందరూ అభినందిస్తున్నారని పేర్కొన్నారు.