బాల్కొండ: ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎంఎండీ వరకున్న ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. అందువల్ల ఎస్ఆర్ఎస్పీలో (SRSP) ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు కేటాయింపునకు కన్న ఎక్కువ వెళ్లకుండా చూడాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈకి సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఉప్లూర్ వరద కాలువ ద్వారా దిగువకు నీరు వెళ్తుండటంతో ఆయన ప్రాజెక్టు ఎస్ఈతో మాట్లాడారు. డ్యాంలో నీటి నిల్వ ఎంత ఉంది.. ఈ సీజన్లో పంటలకు ఎన్ని టీఎంసీలు అవసరమవుతాయని అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం, అధికారులు నీటి విడుదల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్మానేరు డ్యామ్ (MMD) వరకు ఉన్న ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. వరద కాలువ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కిందికి కేటాయింపు కన్నా ఎక్కువ నీరు వదలొద్దని సూచించారు. అలాంటి నిర్ణయాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని.. ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. లేనట్లయితే రైతుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
నాగపూర్ వద్ద ఉన్న నాలుగు గేట్లలో వరద కాలువ ద్వారా నీటిని కిందికి వెళ్తున్నదని రైతులు చెప్పడంతో మరోసారి ఎస్ఈ మాట్లాడారు. వరద కాలువ ద్వారా నీరు వెళ్లడంలేదని మమ్మల్ని తప్పుదోవ పట్టించొదని, వెంటనే వరద కాలువ గేట్లను మూసివేయించాలని ఆదేశించారు. అక్కడ గేట్లకు తేనెతుట్ట ఉండటంతో మూయలేకపోయామని అధికారి చెప్పడంతో అది చిన్న సమస్య అని.. ఆ కారణంతో గేట్లు మూయకుండా నీరు దిగువకు వృధాగా పోనియ్యడం సబబు కాదన్నారు. అవసమైతే ప్రజల సహకారంతో తేనెతుట్టని తొలగించి వెంటనే నాగపూర్ వద్ద ఉన్న గేట్లను మూసివేయాలని సూచించారు.