హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం.. ఆ సంస్థ సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీకి వ్యతిరేకమని లాయర్ సోమా భరత్ అన్నారు. కవిత నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమె అరెస్ట్ చట్టవిరుద్ధమని చెప్పారు. ఈడీ అధికారులు నిబంధనలు పాటించలేదని తెలిపారు. ఒక మహిళను రాత్రివేళ అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. న్యాయమూర్తి నుంచి వారంట్ తీసుకోకుండా అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. కవిత అరెస్టుకు గల కారణాలను తెలపాలని కోరినా ఈడీ అధికారులు పట్టించుకోలేదని అన్నారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అండర్టేకింగ్ను ఈడీ అతిక్రమించిందని చెప్పారు. మహిళను ఈడీ అరెస్ట్ చేసే అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్నదని, అది పూర్తికాకుండానే ఈడీ కవితను అదుపులోకి తీసుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కేసు సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చిందని, ధర్మాసనం ఈ నెల 19కి వాయిదా వేసిందని, అప్పటివరకు వేచి చూడలేని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.