హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ‘తమ అవినీతికి అడ్డొస్తున్నారనే కాంగ్రెస్ నేతలంతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నోరు పారుసుకుంటున్నారు. ఆయనపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్పై అసత్య ఆరోపణలు చేసే కాంగ్రెస్ నేతలను కోర్టుకీడుస్తాం’ అని వారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ హెచ్చరించారు. కేటీఆర్కు మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన పార్టీకి లింక్ పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సీఎం రేవంత్రెడ్డితో చేసిన సహవాస దోషం వల్ల కేటీఆర్పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏ క్లబ్బులో, ఏ పబ్బులో తిరుగుతున్నారో? ఎక్కడ పేకాట ఆడుతున్నారో తాము చెప్పాలా? అని నిలదీశారు.
ప్రజా సమస్యలపై కేటీఆర్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఇలాంటి చిల్లర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు డ్రగ్స్పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు ఉన్నదా? అని ప్రశ్నించారు. చర్లపల్లిలో 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకొన్నది ముంబై పోలీసులని, మరి వారొచ్చి పట్టుకొనే దాకా తెలంగాణ ఈగల్ పోలీసులు ఏం చేశారని నిలదీశారు. ఇది రేవంత్రెడ్డి సర్కార్ చేతకానితనానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రకటించిన లెక్కల ప్రకారం 2025లో 2,572 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా గంజాయి కేసులు పెరిగాయని ఆరోపించారు. దాదాపు 30 శాతం డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందని ఆ ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తుచేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వచ్చే ప్రజాప్రతినిధులకు డ్రగ్, డ్రైంకన్ డ్రైవ్ టెస్టు కేంద్రాలతో పరీక్షించాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ సూచించారు. సోమవారం అసెంబ్లీలో గ్రవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత డ్రగ్స్ టెస్టు చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను ఉద్దేశించి డిమాండ్ చేశారు. మరి ఈ టెస్టు చేయించుకోవడానికి బీఆర్ఎస్ నేతలంతా సిద్ధంగా ఉన్నారని, మరి సీఎం రేవంత్రెడ్డి, ఆ పార్టీ ఇతర నేతలు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన హయాంలో డ్రగ్స్పై ఉక్కుపాద మోపారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ చెప్పారు. కానీ రేవంత్రెడ్డి సర్కార్లో డ్రగ్స్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము సహకరిస్తామని చెప్పారు. కానీ డ్రగ్స్కు రాజకీయాలను ఆపాదిస్తూ.. ముడిపెట్టొద్దని హితవు పలికారు. కేటీఆర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఆ భయంతోనే కేటీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత సీహెచ్ ఉపేంద్ర పాల్గొన్నారు.